డిల్లీ అల్లర్లు... బిజెపి ప్రభుత్వంపై రజనీకాంత్ సీరియస్
దేశ రాజధాని డిల్లీలో చెలరేగిన అల్లర్లపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ అల్లర్లు చెలరేగాయంటూ సంచలన కామెంట్స్ చేశారు.
చెన్నై: దేశ రాజధాని డిల్లీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై ప్రముఖ సినీనటులు రజనీకాంత్ స్పందించారు. డిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు జరిగిన నిరసనలు అల్లర్లకు దారితీయడం ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమేనని అన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై మైనారిటీ వర్గాల్లో పలు అనుమానాలున్నాయని... ఈ చట్టం వల్ల ఏ వర్గాలకు నష్టం కలిగిన తాను వారివెంటే వుంటానన్నారు.
కేంద్ర ప్రభుత్వం డిల్లీలో కొనసాగుతున్న అల్లర్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రజనీకాంత్ సూచించారు. ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రం వ్యవహరించిన తీరును రజనీకాంత్ తప్పుబట్టారు. ఇకనైనా కేంద్రం డిల్లీలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు.
read more డిల్లీ అల్లర్లు... హెల్ప్ లైన్ నంబర్లు విడుదలచేసిన పోలీసులు
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు సద్దుమణగడం లేదు. ఆదివారం ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 22 మంది మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ నలుగురు మరణించారు.
సిఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ హింసకు, దాడులకు దారి తీసింది. ఘర్షణల్లో 150 మంది దాకా గాయపడ్డారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారని అంటూ సైన్యాన్ని రంగంలోకి దింపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం రాత్రి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పోలీసు ఉన్నతాధికారులను కలిశారు.
read more బయటి శక్తుల పనే: ఢిల్లీ అల్లర్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ అల్లర్ల వెనక కుట్ర ఉందని, ఎన్నికల సమయంలో కూడా దేశం దాన్ని చూసిందని కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఢిల్లీ పరిస్థితికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని ఆమె అన్నారు.