09:41 PM (IST) Oct 02

3,500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో ‘‘జన్ సూరజ్’’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో పీకే ఈ యాత్రను ప్రారంభించారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించినట్లుగా జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. 

08:38 PM (IST) Oct 02

భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పాము

భారత్- దక్షిణాఫ్రికాల మధ్య గౌహితిలో జరుగుతోన్న మ్యాచ్‌లో పాము హల్‌చల్ చేసింది. దీంతో నిర్వాహకులు కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. మైదానం సిబ్బంది పామును పట్టుకున్న తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

07:57 PM (IST) Oct 02

ముగిసిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్

అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రయాణం ముగిసింది. ఇటీవలే తన చివరి సందేశాన్ని గ్రౌండ్ స్టేషన్‌కు పంపింది మామ్. ఇంధనం అయిపోవడం, బ్యాటరీ శక్తి తరిగిపోవడం వంటి కారణాలతో ఈ ఆర్బిటర్ పనిచేయడం నిలిచిపోయిందా అన్న కోణంలో ఇస్రో దర్యాప్తు జరుపుతోంది. 

06:41 PM (IST) Oct 02

ములాయం సింగ్ ఆరోగ్యం విషమం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సుశీల కటారియా సూపర్‌విజన్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

04:43 PM (IST) Oct 02

ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు. చిన్నారులంతా 15 ఏళ్లలోపేవారని తెలుస్తోంది. మృతులను సుమరీన్, ఖలీద్, ఇమ్రాన్, రెహానగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

03:41 PM (IST) Oct 02

ప్రగతి భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ

టీఆర్ఎస్ జల్లా అధ్యక్షులు, మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ నెల 5వ తేదీన జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత నెలకొంది. 

02:35 PM (IST) Oct 02

హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆర్ఎస్ఎస్ , బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్రపన్నిన జాహిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది.

01:50 PM (IST) Oct 02

థరూర్ అధ్యక్ష పోటీనుండి తప్పుకోవాలంటూ... ఖర్గే కు భట్టి విక్రమార్క మద్దతు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ నాయకుల నుండి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అధ్యక్ష పోటీ నుండి తప్పుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఖర్గేకు మద్దతు తెలపగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. గాందేయవాది అయిన ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయితే బావుంటుందని... ఇందుకోసం శశి థరూర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. 

12:25 PM (IST) Oct 02

ఇండోనేషియా ఫుట్ బాల్ మ్యాచ్ అల్లర్లు... 174కు చేరిన మృతుల సంఖ్య

ఇండోనేషియా ఫుట్ బాల్ మ్యాచ్ లో చోటుచేసుకున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు ఈ ఘటనలో 174మంది మృతిచెందినట్లు, మరో 100మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. 

12:00 PM (IST) Oct 02

భారీ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ జయంతి సందర్భంగా ఎంజి రోడ్డులోని మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం గాంధీ హాస్పిటల్ వద్ద ఏర్పాటుచేసిన జాతిపిత భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

11:34 AM (IST) Oct 02

తెలంగాణకు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వున్న ఈ ఎనిమిదేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టబడులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ సహకారం, రాష్ట్రంలో బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీ మరియు వాతావరణం వల్లే ఇది సాద్యమయ్యిందన్నారు. 

10:34 AM (IST) Oct 02

భారత్ లో 40వేల దిగువకు యాక్టివ్ కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత తగ్గుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కేవలం 3,375 కొత్తకేసులు మాత్రమే వెలుగుచూసాయి. ఇదే సమయంలో 18 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారి కేసుల కంటే కరోనా నుండి రికవరీ అవుతున్న వారి సంఖ్యే ఎక్కువగా వుంటోంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 37,444 కు చేరాయి.

09:48 AM (IST) Oct 02

నేడు మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ లంచ్ మీటింగ్

దసరా రోజున జాతీయపార్టీ ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు నేడు ప్రగతి భవన్ లో కీలక సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటుచేసారు. 

09:38 AM (IST) Oct 02

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

భారత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ మరియు విజయ్ ఘాట్ లను ప్రధాని సందర్శించారు. గాంధీ జయంతి రోజున ప్రతిఒక్కరు చేనేత, ఖాది వస్త్రాలను కొనుగోలుచేయాలని దేశ ప్రజలకు ప్రధాని సూచించారు.