మస్సాజ్ సెంటర్లో మహిళపై కస్టమర్, మేనేజర్ గ్యాంగ్ రేప్.. మహిళా కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీలోని ఓ స్పా సెంటర్లో మస్సాజ్ చేసే మహిళపై కస్టమర్, ఆ స్పా సెంటర్ యజమాని కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలు శనివారం ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని స్పా సెంటర్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ స్పా సెంటర్లలో పలుమార్లు వ్యభిచార ఘటనలు బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, స్పా సెంటర్లో మస్సాజ్ చేయడానికి నియమించిన ఓ మహిళా ఉద్యోగిపైనే ఆ స్పా సెంటర్ యజమాని, ఓ కస్టర్ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన పీతంపురలోని ది ఓషియన్ స్పా సెంటర్లో చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు ఢిల్లీ మహిళా కమిషన్ను శనివారం ఆశ్రయించింది.
పీతంపురలోని ది ఓషియన్ స్పా సెంటర్లో ఆమెను మస్సాజ్ చేసే వర్కర్గా రిక్రూట్ చేసుకున్నారు. ఆమెను కేవలం మహిళలకే మస్సాజ్ చేసే పని మీద తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆమెను పురుషులకు కూడా మస్సాజ్ చేయాలని ఆదేశించారు. స్పా సెంటర్కు వచ్చిన ఓ కస్టమర్ను మేనేజర్ ఆమెకు పరిచయం చేశాడు. అనంతరం, ఆమెకు మత్తు కలిపిన ఓ డ్రింక్ను అందించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత వారిద్దరు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. మెలుకువలోకి వచ్చిన తర్వాత ఆమె ఈ విషయాన్ని మేనేజర్ ముందు లేవనెత్తింది. ఆమె నోరు మూయించడానికి ఆ స్పా మేనేజర్ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినట్టు బాధితురాలు తెలిపారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వెంటనే రంగంలోకి దిగారు. ఈ కేసులో తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి నోటీసులు పంపారు. ఆ స్పా సెంటర్ నడపడానికి లైసెన్స్ ఉన్నదా? లేని యెడల అందుకు బాధ్యత వహించాల్సినవారు ఎవరు? అని ప్రశ్నించారు. ఈ వివరాలు అన్నీ ఈ నెల 8వ తేదీ లోపు తనకు సమర్పించాలని ఆదేశించారు.
ఢిల్లీలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాన్ని నడుపుతున్నారని స్వాతి మలివాల్ ఆగ్రహించారు. స్పా సెంటర్లో బాలికలు, మహిళలపై బ్లాక్ మెయిల్, బెదిరింపుల కారణంగా వారు తమపై జరిగిన అఘాయిత్యాలను బయటకు చెప్పుకోలేకున్నారని తెలిపారు. ఈ బాధితురాలిని స్పా సెంటర్ వారు కేవలం మహిళలకు మాత్రమే మస్సాజ్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగంలోకి తీసుకున్నారని చెప్పారు.
అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు.