సినిమాల్లోకి అడుగుపెడుతున్న స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె
ఇప్పుడు ఆమె సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్ పిళ్లై అనే టైటిల్ని నిర్ణయించారు.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చాలా పాపులర్. ఆయన గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను అప్పట్లో గడగడలాడించిన ఘనత ఆయనది. ఆ తర్వాత 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కాల్చి చంపేశారు.
కాగా... ఇప్పుడు వీరప్పన్ గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. వీరప్పన్కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్ పిళ్లై అనే టైటిల్ని నిర్ణయించారు.
కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.