Aryan Khan: ఆట ఇప్పుడే మొదలైంది.. వెయిట్ అండ్ వాచ్.. : ఎంపీ సంజయ్ రౌత్.. శామ్ డిసౌజా ప్రస్తావన
ఆర్యన్ ఖాన్ కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులోని సాక్షి ఎన్సీబీ అధికారిపై సంచలన ఆరోపణలు చేసి అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా సంజయ్ రౌత్ ఈ కేసులో మరిన్ని విషయాలను వెల్లడించబోతున్నట్టు సంకేతంగా వెయిట్ అండ్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు. రూ. 25 కోట్ల డీల్ గురించి మాట్లాడిన శామ్ డిసౌజాను ప్రస్తావించారు.
ముంబయి: మహారాష్ట్ర నుంచి గోవాకు బయల్దేరిన ఓ క్రూజ్ షిప్లో రైడ్ చేసి డ్రగ్స్ పట్టుకున్నట్టు చెప్పిన NCB.. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు Aryan Khan ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలతో కేసులో సరికొత్త ట్విస్టు వచ్చింది. ఇప్పుడు కేసుపై ఫోకస్ అంతా ఎన్సీబీ టాప్ అధికారి Sameer Wankhedeపైకి మళ్లింది. ఈ కేసు మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే పెట్టారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా ఎన్సీబీ తీరును పలుసార్లు విమర్శలు చేశారు. ప్రభాకర్ సాయిల్ ఆరోపణల తర్వాత శివసేన ఎంపీ Sanjay Raut తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాకర్ సాయిల్ ఆరోపణల తర్వాత సంజయ్ రౌత్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్యన్ ఖాన్తో కలిసి మాట్లాడుతున్న ప్రైవేటు డిటెక్టర్ కేపీ గోసావి వీడియోను ట్వీట్ చేస్తూ సాక్షిని బ్లాంక్ పేపర్పై సంతకం పెట్టాలని బెదిరించి తీసుకోవడం షాకింగ్గా ఉన్నదని పేర్కొన్నారు. తాజాగా, వెయిట్ అండ్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. మరిన్ని సంచలన విషయాలను ఆయన వెల్లడించబోతున్నట్టు సంకేతాలనిచ్చారు.
Also Read:ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్సీబీ దర్యాప్తు
శామ్ డిసౌజా ముంబయిలోనే కాదు.. ఈ దేశంలోనే అతిపెద్ద మనీలాండరింగ్కు పాల్పడే వ్యక్తి అని సంజయ్ రౌత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద గేమ్ అని, అది ఇప్పుడే స్టార్ట్ అయిందని తెలిపారు. ఇప్పటికి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు విస్తూపోయేలా ఉన్నాయని వివరించారు. దేశభక్తి పేరుతో కొందరు డబ్బు గుంజుతున్నారని, నకిలీ కేసులు పెడుతున్నారని అన్నారు.
ప్రభాకర్ సాయిల్ చేసిన ఆరోపణల్లో శామ్ డిసౌజాను ప్రస్తావించారు. రూ. 25 కోట్ల డీలింగ్ గురించి కేపీ గోసావి(ఆర్యన్ ఖాన్ కేసులో ఈయన కూడా సాక్షి) శామ్ డిసౌజాతో మాట్లాడారని పేర్కొన్నారు. రూ. 25 కోట్ల డీల్ రూ. 18 కోట్లకు సెటిల్ అయినట్టు పేర్కొన్నారు. తాజాగా, ఈ శామ్ డిసౌజా అనే వ్యక్తి మనీలాండరింగ్ బిగ్ ప్లేయర్ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.