కుట్ర చేసిన ఆ నేత ఎవరో త్వరలోనే చెబుతా.. వాళ్లపైనా సీడీలొస్తాయి: రమేశ్ జార్కిహోలీ
కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన రాసలీలల సీడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహోలీ మీడియా ముందుకు వచ్చారు. గత 10 రోజులుగా సీడీల వ్యవహారం గురించే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన రాసలీలల సీడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహోలీ మీడియా ముందుకు వచ్చారు. గత 10 రోజులుగా సీడీల వ్యవహారం గురించే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.
తప్పు చేసిన వారిని జైలుకు పంపేవరకు తాను విడిచిపెట్టేది లేదని రమేశ్ తేల్చిచెప్పారు. దేవుని దయతో నిర్దోషిగా బయటికి వస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంపై రాద్దాంతం చేస్తున్న వారిపై కూడా సీడీలు విడుదల కావచ్చంటూ ఆయన హెచ్చరించారు. యువతి తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వీడియోలో కోరడాన్ని బట్టి ఇది కుట్ర అని మరోసారి రుజువైందని మాజీ మంత్రి హెచ్చరించారు.
తీవ్రమైన కేసు కావడం వల్ల తాను ఎక్కువగా మాట్లాడనని రమేశ్ పేర్కొన్నారు. తాను కూడా సాక్ష్యాధారాలు సేకరించానని, అన్నీ తన జేబులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
వాటిని బహిర్గతం చేస్తే షాక్ అవుతారని.. సీడీల వెనకున్న ఆ నేత పేరును త్వరలోనే ప్రకటిస్తానని రమేశ్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి , సీఎల్పీ నేత సిద్ధరామయ్య పట్ల తనకు గౌరవం ఉండేదని, కానీ ఆయన తనపై ఎప్పుడైతే అత్యాచారం నమోదు చేయాలనడం ద్వారా సిద్ధరామయ్యపై గౌరవం పోయిందని చెప్పారు.
ఎక్కువగా మాట్లాడరాదని న్యాయవాది సూచించడం వల్ల అన్ని విషయాలనూ బహిరంగపరచలేనని రమేశ్ పేర్కొన్నారు.