అమెరికాకు భయపడ్డ ఎస్బీఐ..తలపట్టుకున్న చమురు కంపెనీలు
అమెరికాకు భయపడ్డ ఎస్బీఐ..తలపట్టుకున్న చమురు కంపెనీలు
ఇరాన్తో అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో పాటు మరోసారి ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించడం పలు దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై ప్రభావం చూపుతోంది. తాజాగా ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశీయ సంస్థలకు నవంబర్ నుంచి చెల్లింపులు చేపట్టబోమని ఆయిల్ కంపెనీలకు తెలిపింది.
ఇరాన్ నుంచి దేశంలోని మెజారిటీ చమురు కంపెనీలు ముడి చమురును దిగుమతి చేసుకుంటాయి.. ఇందుకు ఎస్బీఐతో పాటు జర్మనీకి చెందిన యూరోపియన్ ఇరానీష్ హండెల్స్బ్యాంక్ ఏజీ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఎస్బీఐ సహా రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి కంపెనీలు లావాదేవీల విషయంలో వెనక్కు తగ్గాయి. ఎందుకంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థతో సంబంధాలున్న కంపెనీలు.. ఆ దేశం ఆంక్షలు విధించిన దేశాలతో ఎలాంటి వ్యాపార, వాణిజ్య పరమైన సంబంధాలు నెరపరాదు.. లేదంటే వారు జరిమానాలు కట్టాల్సి వస్తుంది.