మిత్రుణ్ణి, సహచరుడిని కోల్పోయా: పాశ్వాన్ మృతిపై మోడీ దిగ్భ్రాంతి
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్:
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. అతను అణగారిన వర్గాలవారికి స్వరం, అట్టడుగున ఉన్నవారికి విజయాన్ని అందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా
ప్రధాని నరేంద్రమోడీ :
రామ్విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్:
కేంద్రమంత్రి, లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాస్ (74) మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాశ్వాన్ దళితుల కోసం ఎనలేని సేవ చేశారని గవర్నర్ ప్రస్తుతించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ఎస్పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు. ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు జగన్ తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని సీఎం గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని కేసీఆర్ కొనియాడారు. పాశ్వాన్ మృతి పట్ల పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
సీనియర్ నాయకుడు శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ గారి మరణం తీవ్ర విచారానికి గురి చేసింది. సుదీర్ఘ కాలం జాతీయ రాజకీయాలలో ఆయన అత్యున్నత నాయకత్వం సాటిలేనిది. ఆయన నిస్వార్థ సేవలు, ఆయన లేని లోటు దేశానికి తీరనిది.