మాంత్రికుడు రాత్రుళ్లు కలల్లోకి వచ్చి రేప్ చేస్తున్నాడు: మహిళ ఫిర్యాదు
బీహార్ పోలీసుల ముందుకు ఓ వింత కేసు వచ్చింది. మాంత్రికుడు రాత్రుళ్లు తన కలల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాంత్రికుడిని పోలీసులు విచారించారు.
ఔరంగాబాద్: బీహార్ లో పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. మాంత్రికుడు రాత్రుళ్లు కలల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఔరంగాబాద్ జిల్లా కుద్వ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో జనవరిలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. ఆ మాంత్రికుడు మహిళ కుమారుడి ఆరోగ్యం కోసం పూజలు చేశాడు. అయితే, 15 రోజుల తర్వాత ఆమె కుమారుడు మరణించాడు.
కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్ చతుర్వేది ఉంటున్న కాళీబరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడి మరణానికి కారణం చెప్పాలని నిలదీసింది. ఈ స్థితిలో తన మాంత్రికుడి తనపై అత్యాచారం చేయబోగా మరణించిన తన కుమారుడు అడ్డుకున్నాడని మహిళ ఫిర్యాదులో చెప్పింది. అప్పటి నుంచి ప్రశాంత్ రాత్రుళ్లు తన కలల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ ను విచారించారు. అయితే, అతను మహిళ ఆరోపణలను తోసిపుచ్చాడు. ఆమెను తాను ఎప్పుడూ కలుసుకోలేదని చెప్పాడు. నిందితుడిపై పోలీసులకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు. దీంతో బాండ్ మీద సంతకం చేయించుకుని వదిలేశారు.