పవన్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం: నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్
తాను మైనర్ నంటూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారంనాడు కొట్టేసింది.
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషిగా తేలిన పవన్ కుమార్ గుప్తా పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో నిర్భయ కేసు దోషులను నలుగురిని ఉరితీయడానికి లైన్ క్లియర్ అయినట్లే. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ట్రయల్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, దోషుల్లో ఒక్కడైన పవన్ కుమార్ గుప్తా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగిన సమయంలో తాను మైనర్ అని, అందువల్ల తనను అలా పరిగణించి శిక్షను నిర్ణయించాలని అతను పెట్టుకున్న పిటిషన్ ను గతంలో ఢిల్లీ హైకోర్టు తోసిప్చుచింది. దాన్ని సవాల్ చేస్తూ పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Also Read: నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా తరఫు లాయర్ కు షాక్
అవే విషయాలను తాము ఎన్నిసార్లు వినాలని, చాలా సార్లు అదే విషయాన్ని నువ్వు లేవనెత్తావని సుప్రీంకోర్టు పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది ఎపీ సింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నేరం జరిగినప్పుడు పవన్ కుమార్ గుప్తా మైనర్ అనే విషయం అతని స్కూల్ సర్టిఫికెట్లు చెబుతున్నాయని, అతని పత్రాలను ఏ కోర్టు కూడా పట్టించుకోలేదని ఏపీ సింగ్ అన్నాడు.
ప్రతి న్యాయ వేదిక మీద అతను చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు, అతను ప్రతిసారీ, ఇప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడమంటే న్యాయాన్ని పరిహాసం చేయడమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
Also Read: నిర్భయ కేసు దోషులను ఉరితీసేది ఇతనే
నేరం జరిగినప్పుడు దోషికి 19 ఏళ్లు ఉన్నాయని, అందుకు సంబంధించి పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, స్కూల్ లీవింగ్ సర్టిఫెకెట్ ఉన్నాయని, ప్రతి న్యాయ వేదిక మీద ఆ విషయాన్ని చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు.
నిర్బయపై గ్యాంగ్ రేప్ జరిగి ఆమెను హత్య చేసిన సమయంలో పవన్ కుమార్ గుప్తాకు 18 ఏళ్లు దాటాయని అతని తల్లిదండ్రులు కూడా చెప్పారని పోలీసులు తెలిపారు. నేరం జరిగన సమయంలో ఓ నిందితుడు మైనర్ గా తేలాడు. దాంతో రిఫార్మ్ హోమ్ లో మూడేళ్లు ఉన్న తర్వాత అతన్ని విడుదల చేశారు.
తాను మైనర్ నంటూ పవన్ కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నలుగురు దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైన నేపథ్యంలో అతను ఆ పనిచేశాడు.