నీరవ్ పాస్పోర్ట్ మిస్టరీ..? తలపట్టుకుంటున్న అధికారులు..!!
నీరవ్ పాస్పోర్ట్ మిస్టరీ..? తలపట్టుకుంటున్న అధికారులు..!!
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ వ్యవహారం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తొంది. అన్నింటికి మించి పాస్పోర్ట్ను రద్దు చేసినా అతను అన్ని దేశాల మీదుగా ఎలా ప్రయాణించగలిగాడన్నది మిస్టరీగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి తన భండారం బయటపడుతుందని భారత భూభాగాన్ని దాటాడు..
ఈ విషయం తెలిసిన వెంటనే ఫిబ్రవరి 15న భారత విదేశాంగ శాఖ నీరవ్ మోడీ పాస్పోర్ట్ను రద్దు చేసింది.. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ... ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ నీరవ్ సింగపూర్, బ్రిటన్ ఇప్పుడు బ్రస్సెల్స్కు ఎలా వెళ్లగలిగాడన్నది ఫజిల్గా మారింది. అతని వద్ద నకిలీ పాస్పోర్ట్ ఉందని కాదు కాదు సింగపూర్ పాస్పోర్ట్ ఉందని దాని సాయంతోనే దేశాలు మారాడని ప్రచారం జరిగింది.
అయితే విదేశాంగశాఖకు చెందిన అత్యున్నత అధికారుల వాదన మరోలా ఉంది.. నీరవ్కు తొలుత ‘N’ సిరీస్ పాస్పోర్ట్ను జారీ చేశామని.. అది నిండిన తర్వాత ‘Z’ సిరీస్కు చెందిన పాస్పోర్ట్ను జారీ చేశామని తెలిపారు.. పారిశ్రామిక వేత్త కావడంతో అతని పాస్పోర్ట్ త్వరగా నిండుకునేదని.. తరచూ దానిని రెన్యువల్ చేయించుకోవటం వల్ల నీరవ్ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాస్పోర్ట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. తద్వారా నాలుగు నుంచి ఐదు పాస్పోర్ట్లు వుండివచ్చని.. వాటి సాయంతో టికెట్ సంపాదించాడేమో అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.