బాలికపై వివాహితుడి రేప్... నిందితుడుకి బెయిల్, కోర్ట్ని ఎలా ఒప్పించాడంటే..?
ముంబైలోని పోక్సో కోర్టు పదహారేళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసి సంచలనం కలిగించింది
ముంబైలోని పోక్సో కోర్టు పదహారేళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసి సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల వివాహితుడు, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది.
అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఎవరికైనా చెబితే చంపేయాలని నిందితుడు బెదిరించడంతో బాధితురాలు మౌనం దాల్చింది. అయితే కొన్నాళ్ల తర్వాత బాధితురాలి శరీరంలో మార్పులు గమనించిన ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా గర్భవతిగా తేల్చారు .
దీంతో ఆమె సదరు వివాహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కోర్టు బెయిలు నిరాకరించింది.
కోర్టు దగ్గర తన ఆటలు సాగకపోవడంతో నిందితుడు కొత్త ఎత్తు వేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు రాయబారం పంపాడు.
తన కుమార్తె జీవితం బాగు పడుతుందని భావించిన సదరు తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. అంతేకాకుండా అతడిని విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే విషయాన్ని నిందితుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది. అయితే పోలీసులు మాత్రం అతడికి బెయిలు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు.
మొదటి భార్య రెండో వివాహానికి అంగీకరించినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని, పెళ్లి పేరిట శిక్ష నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు ఆరోపించారు.
కానీ నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం.. అతడి సామాజిక వర్గంలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇందులో బెయిలు నిరాకరించాల్సిన అవసరం లేదంటూ చెప్పారు.
అతని వాదన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తుది తీర్పు వెలువరించింది. అయితే కోర్టు తీర్పు పట్ల కొందరు సామాజిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.