కుమారస్వామి బలపరీక్ష: బిజెపి వ్యూహం ఇదీ
ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఏకపక్షంగా జరగకూడదనే వ్యూహంతో బిజెపి ముందుకు సాగుతోంది.
బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఏకపక్షంగా జరగకూడదనే వ్యూహంతో బిజెపి ముందుకు సాగుతోంది. కుమారస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 111 మంది సభ్యుల మద్దతు అవసరం. జెడిఎస్, కాంగ్రెసు సభ్యుల సంఖ్య 115 ఉంది. ఈ రకంగా విశ్వాస పరీక్షలో నెగ్గడం కుమారస్వామికి పెద్ద కష్టమేమీ కాదు.
కానీ, బిజెపి దానికి ముందే పరీక్ష పెట్టే ఉద్దేశంతో ఉంది. కుమారస్వామి విశ్వాస పరీక్షకు ముందే స్పీకర్ ఎన్నికలోనే అసలు విషయాన్ని తేల్చేయాలని బిజెపి అనుకుంటోంది. స్పీకర్ పదవికి మాజీ న్యాయశాఖ మంత్రి సురేష్ కుమార్ ను పోటీకి దించుతోంది.
కాంగ్రెసుకు 78 మంది, జెడిఎస్ కు 37 మంది, బిఎస్పీకి 1 ఎమ్మెల్యులు ఉన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెసు, జెడిఎస్ సంకీర్ణ కూటమికి ఉంది. అందువల్ల కుమారస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గుతారనే అభిప్రాయం బలంగా ఉంది.
కుమారస్వామి బలపరీక్షలో నెగ్గే అవకాశం ఉందని తేలితే బిజెపి శాసనసభ నుంచి వాకౌట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. స్పీకర్ ఎన్నికతోనే అది తేలిపోతుంది కాబట్టి వాకౌట్ చేయడానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు.