దేశ రాజధాని డిల్లీలో దారుణం : విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్
కారులోనే అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు కామాంధులు
దేశ రాజధాని డిల్లీలో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. దేశ ప్రతిష్టకి విదేశాల్లో భంగం కలిగించేలా ఓ విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. డిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలో అర్థరాత్రి క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీ మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ దుర్ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత విదేశీ యువతి దక్షిణ డిల్లీలోని చత్తర్ పూర్ ప్రాంతంలోని తన నివాసానికి వెళ్లడానికి గుర్గావ్ లోని బ్రిస్టల్ చౌక్ వద్ద క్యాబ్ కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ఓ ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి యువతికి లిప్ట్ ఇస్తామని అడిగారు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకుని లైంగిక దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత కారును గోల్డ్ కోర్స్ రోడ్డుకు తీసుకుపోయి నిందితులు అక్కడ మరో ఇద్దరు స్నేహితులను కారులో ఎక్కించుకున్నారు.ఇలా ఐదుగురు కలిసి యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చంపెస్తామని ఆమెను నడి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు.
అయితే నిందితులు తనను వదిలేసే సమయంలో యువతి ఆ కారు సంబర్ ను నోట్ చేసుకుంది. ఈ వివరాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన సుందర్, మోహిత్,పర్విన్ లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.