షాక్: బాలికపై పోలీసుల అత్యాచారం, బలవంతంగా వ్యభిచారంలోకి
సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 14 ఏళ్ల బాలిక ఆరోపణలు గుప్పించింది. తనను బ్లాక్మెయిల్ చేసి ఏడాదికాలంగా సెక్స్ రాకెట్ లో వాడుకొన్నారని ఓ బాలిక ఝార్ఖండ్ సీఎం రఘుబర్దాస్కు ఫిర్యాదు చేసింది
రాంచీ: సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 14 ఏళ్ల బాలిక ఆరోపణలు గుప్పించింది. తనను బ్లాక్మెయిల్ చేసి ఏడాదికాలంగా సెక్స్ రాకెట్ లో వాడుకొన్నారని ఓ బాలిక ఝార్ఖండ్ సీఎం రఘుబర్దాస్కు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై స్పందించిన సీఎం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఝార్ఖండ్ సీఎం రఘుబర్దాస్ ప్రతి మంగళవారం నాడు సీదీబాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలపై ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలు సీఎంకు తన బాధలను పంచుకొంది.బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోపుగా నివేదిక అందించాలని ఆయన కోరారు.
ఈ ఏడాది మార్చి 13వ తేదీన బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె కోర్టును కోరారు. గతంలో బాలిక గుర్తించిన 16 మంది జాబితాను కోర్టుకు అందజేశారు.
తనపై అత్యాచారం చేసిన వారిలో ఏంజీఎం పోలీస్స్టేషన్ ఇంచార్జీ ఇమ్దాద్ అన్సారీ, పటండా డీఎస్పీ అజయ్ కేర్కెట్టా కూడ ఉన్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. తనను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారని బాధితురాలు ఆరోపించింది.
పోలీసులు, రాజకీయ నాయకులు, బిల్డర్లు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం సీఎంకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని బెదిరించి వ్యభిచారం చేయించారని చెప్పారు.
ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కేసు విచారణ జరుపుతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రటకించారు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను బదిలీ చేశారు.