భారత్ బయోటెక్: ఆగస్టు 15నాటికి కరోనాకి వ్యాక్సిన్
ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఏ) భారత్ బయోటెక్కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ వైరస్ ని అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కాగా.. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందుకేసింది.
ఇప్పటికే అనేక కంపెనీలు కరోనా వ్యాక్సిన్పై తన ప్రయోగాలను ముమ్మరం చేశాయి. పలు కంపెనీలు క్లినికల్ ట్రయిల్స్ దశల్లో సక్సెస్ కూడా సాధించాయి. అలాంటి కంపెనీల జాబితాలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఉంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్పై సక్సెస్ఫుల్గా ట్రయిల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోపిక్ కంపెనీ... ఇందుకోసం ఐసీఎంఆర్తో కలిసి పని చేస్తోంది.
ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఏ) భారత్ బయోటెక్కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది.
తాము జరిపిన ముందస్తు పరిశోధనల ఫలితాల ఆధారంగా ఇది ఎంతవరకు సురక్షితం, రోగనిరోధక ప్రతిస్పందన ఎలా ఉందనే వివరాలు సమర్పించడంతో తమకు అనుమతులు వచ్చాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.
వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశం కంటే ఇది ఎంత సురక్షితం అనేదే ప్రధానంగా ఈ ప్రయోగాలు జరుగుతాయి. కాగా.. కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధిస్తున్న భారత్ బయోటెక్... రాబోయే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐసీఎంఆర్ సైతం కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కంపెనీకి సూచించింది.
ఈ వ్యాక్సిన్ కనుక అందుబాటులోకి వస్తే... కొన్ని కోట్ల మంది ప్రజలు.. ఈ కరోనా వైరస్ నుంచి బయటపడే అవకాశం ఉంది.