ఘోరం.. పెళ్లి సాకుతో మహిళపై సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పదే పదే అత్యాచారం.. ఎక్కడంటే ?
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళపై లైంగిక దాడులు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. పలు పథకాలు అమలు చేస్తున్నా ఈ వేధింపులు ఆగడం లేదు. పసి పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఎవరినీ వదలడం లేదు. వావి వరసలు కూడా మరిచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రజలను రక్షించే బాధ్యతల్లో ఉన్న వారే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళపై సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పదే పదే అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తన చెల్లెలు భర్త ద్వారా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేసే విజయ్ కుమార్ (33)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆమెను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదే పదే అత్యాచారం చేశాడు. కానీ చివరికి ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోబోనని చెప్పాడు. ఆమె ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
అయితే వీరిద్దరూ ఢిల్లీతో పాటు బయట పలు ప్రదేశాల్లో కూడా శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారని ‘ఎన్టీటీవీ’ నివేదించింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. బాధిత మహిళకు 2013 ఫిబ్రవరిలోనే వివాహం జరిగింది. అక్టోబర్ 2014 లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. తరువాత భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఈ జంట తమకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో నిందితుడు అయిన విజయ్ కుమార్ కు కూడా గతంలో వివాహం జరిగింది. అతడికి విడాకుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఓ మానసిక వికలాంగ మైనర్ బాలికపై ఏడాదికి పైగా ఓ దుండగుడు అత్యాచారం జరిపిన ఘటన మహారాష్ట్రలోని బారామతిలో గత నెల 16వ తేదీన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక గర్బం దాల్చింది. పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా వాల్చంద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు. 6వ తరగతి చదువుతున్న బాధితురాలిపై నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు అనేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ తో పాటు మరో ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఓ నిందితుడు ఆమెను బైక్పై ఎక్కించుకొని సమీపంలో ఉన్న చెరుకు తోట వద్దకు తీసుకెళ్లేవాడు అక్కడ అనిల్ నలవాడే అనే మరో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఏడాది కాలానికి పైగా బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.