అప్పు తీర్చకపోతే కూతుళ్లను పంపు: వడ్డీ వ్యాపారుల వేధింపు, సూసైడ్
అప్పు తీర్చకపోతే ఇద్దరు కూతుళ్లను పంపాలని వడ్డీ వ్యాపారులు చేసిన వేధింపులు భరించలేక ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
గురుగ్రామ్: అప్పు తీర్చకపోతే ఇద్దరు కూతుళ్లను పంపాలని వడ్డీ వ్యాపారులు చేసిన వేధింపులు భరించలేక ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని మృతుడి భార్య మోనిదేవి ఆరోపిస్తోంది. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో చోటు చేసుకొంది.
మోని దేవి భర్త సురేందర్ సైనీ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం అవసరాల నిమిత్తం సైనీ అదే గ్రామానికి చెందిన ముగ్గురు వడ్డీ వ్యాపారుల నుండి లక్ష రూపాయాలను అప్పుగా తీసుకొన్నాడు. కానీ, వాటిని తీర్చలేదు.
అప్పులు తీర్చాలని కోరుతూ వడ్డీ వ్యాపారులు సైనీ మీద ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆయన అప్పులను తీర్చలేదు.అప్పులు చెల్లించకపోతే తన ప్రాణాలకు అపాయమని భావించి పోలీసులకు కూడ ఆయన ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు మాత్రం సకాలంలో స్పందించలేదు.
ఈ విషయమై సైనీ ఇంటికి వడ్డీ వ్యాపారులు వచ్చి దూషించారు. అంతేకాదు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు సైనీ ఇద్దరు కుమార్తెలను తమ వెంట పంపించాలని వడ్డీ వ్యాపారులు వేధించారు. అంతేకాదు అసభ్యంగా మాట్లాడారు. ఈ అవమానాన్ని భరించలేక సైనీ ఆత్మహత్య చేసుకొన్నాడు.
తన భర్త ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు సకాలంలో స్పందిస్తే సైనీ ఆత్మహత్య చేసుకొనే వాడు కాదని మోని దేవి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సైనీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.