మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... పది మంది యువకులు అరెస్ట్
మైనర్ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అగర్తల: మైనర్ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఖోవాయి జిల్లా ఖాసియమంగల్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మైనర్ బాలికను అడవుల్లోకి ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 21వ తేదీన ఒంటరిగా వున్న ఓ 17ఏళ్ల బాలికను కొందరు యువకులు బలవంతంగా అడవుల్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడ ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాలికను అక్కడే బంధించి మరో ఇద్దరు స్నేహితులను అక్కడికి పిలిపించారు. వారు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఐదుగురు అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆమెను అక్కడే వదిలేసి యువకులు అక్కడినుండి పరారయ్యారు.
ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం ఈ అఘాయిత్యానికి పాల్పడిని ఐదురుగు యువకులతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు మొత్తంగా పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.