తుత్తూకుడి పోలీసు కాల్పుల్లో హీరో ధనుష్ ఫ్యాన్ మృతి
తమిళనాడులోని తూత్తుకుడి కాల్పుల్లో హీరో ధనుష్ అభిమాని మృతి చెందాడు.
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి కాల్పుల్లో హీరో ధనుష్ అభిమాని మృతి చెందాడు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ నిరసిస్తూ ఆందోళనకు దిగినవారిపై పోలీసులు జరిపిన తుపాకీ కాల్పుల్లో 13 మంది మరణించిన విషయం తెలిసిందే.
వారిలో ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వ సమీప బంధువు ఒకరు, ధనుష్ అభిమాని ఒకరు ఉన్నారు. తన అభిమాని మృతిపై ధనుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
"తుపాకీ కాల్పుల్లో నా సంక్షేమ సభ్యుడు, తమ్ముడు ఎస్.రఘు అలియాస్ కాళియప్పన్ మరణించిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అతడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కాళియప్పన్ కుటుంబసభ్యులను కలుస్తా. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలి" అని ధనుష్ అన్నారు.
కాళియప్పన్ తుత్తూకుడిలోని అన్నానగర్ ప్రాంతంలో బుధవారంనాడు మరణించాడు. గాయపడి ప్రాణాలతో కొట్టుకుంటున్న కాళియప్పన్ పట్ల పోలీసులు నిర్దయగా వ్యవహరించినట్లు వీడియోలు తెలియజేస్తున్నాయి.
స్టెరిలైట్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజల మనోభావాలను గౌరవించాలని, వారికి న్యాయం చేయాలని ధనుష్ అన్నారు. కాల్పుల ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పోలీసు కాల్పుల ఘటన తర్వాత వెంటనే ధనుష్ ట్వీట్ చేశారు.