NCP వర్సెస్ BJP: దీపావళి తర్వాత బాంబు పేలుస్తా.. ఎన్సీపీ మంత్రిపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఫైర్
మహారాష్ట్రలో డ్రగ్స్ వ్యవహారం ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ, నవాబ్ మాలిక్ ఆరోపణలు, వాటికి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడీ వ్యవహారం పూర్తిగా రాజకీయరూపు సంతరించుకున్నాయి. డ్రగ్స్ కేసు నిందితుడి ఫైనాన్స్ తీసిన మ్యూజిక్ వీడియోలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారని, నిందితుడి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ఫొటోనూ నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్కే అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయని, ఆ ఆధారాలన్నీ దీపావళి తర్వాత విడుదల చేస్తానని ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్ చేశారు.
ముంబయి: Bollywood బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు Aryan Khan నిందితుడిగా ఉన్న Drugs Caseపై రాజకీయం రాజుకుంది. ఆర్యన్ ఖాన్కు బెయిల్ లభించింది. ఆయన మన్నత్కు వెళ్లిపోయాడు. కానీ, ఆ కేసు ప్రకంపనలు ఇంకా తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ చర్చ NCP వర్సెస్ BJPగా మారింది. పూర్తిగా రాజకీయం రంగు పులుముకుంది. మహారాష్ట్ర మంత్రి Nawab Malik ఆరోపణలతో బీజేపీ నేత, మాజీ సీఎం Devendra Fadnavis కౌంటర్ ఎటాక్తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
దేవేంద్ర ఫడ్నవీస్కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నాయని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన జయదీప్ రాణేతో ఫడ్నవీస్కు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు నిందితుడికి సీఎం అపాయింట్మెంట్ సులువుగా లభించేదని తెలిపారు. సీఎం నివాసానికైనా, సీఎం కార్యాలయానికైనా ఆయన నేరుగా వెళ్లేవారని, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆయనతో గంటలపాటు సంభాషణలు జరిపేవాడని నవాబ్ మాలిక్ బాంబు పేల్చారు. డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న ఓ నిందితుడి ఫైనాన్స్తో రూపొందించిన మ్యూజిక్ వీడియోలో దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆ నిందితుడితో దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ దిగిన ఫొటోనూ నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు.
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నవాబ్ మాలిక్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నవాబ్ మాలిక్ ఆరోపణలపై స్పందించారు. నవాబ్ మాలిక్కు అండర్ వరల్డ్తో లింకులున్నాయని కౌంటర్ అటాక్ ఇచ్చారు. అండర్ వరల్డ్తో ఆయనకున్న సంబంధాలపై అన్ని ఆధారాలు వెల్లడిస్తానని అన్నారు. ఈ దీపావళి పండుగ ముగిసిపోని, ఆ తర్వాత అసలైన బాంబు పేలుస్తానని హెచ్చరించారు. నవాబ్ మాలిక్ పేలని బాంబు పేల్చారని, తాను అసలైన పెద్ద బాంబు పేలుస్తానని అన్నారు. ఆ ఆధారాలన్నీ ముందుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కే పంపిస్తానని తెలిపారు.
Also Read: Aryan Khan: సమీర్ వాంఖడేపై ఎన్సీబీ నుంచే ఫిర్యాదు..! లెటర్ షేర్ చేసిన మంత్రి
డ్రగ్స్ కేసు నిందితుడితో అమృతా ఫడ్నవీస్ ఫొటోపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘రివర్ మార్చ్’ టీమ్ ఆయన ఆరోపణలకు కావాల్సిన వివరణ నిన్ననే ఇచ్చిందని వివరించారు. వీడియో ఫైనాన్స్ హెడ్గా పేర్కొన్న జయదీప్ రాణా గురించి టీమ్ వివరణ ఇచ్చిందని, క్రియేటివ్ టీమ్ ఆయన్ను ప్రాజెక్టులోకి తీసుకుందని తెలిపారు. అసలు ఆ ఫొటో నాలుగేళ్ల క్రితం నాటిదని, ఇప్పుడు కుట్రపూరితంగా సర్క్యులేట్ చేస్తున్నారని వాదించారు. అప్పుడు ఆయన అరెస్టు కాలేదని వివరించారు.
ఆ నిందితుడితో నవాబ్ మాలిక్ ఫొటోలూ ఉన్నాయని అన్నారు. కేవలం ఫొటో ఆధారంగా ఇంతటి ఆరోపణలు చేయడమేంటని వాదించారు. తనకు, తన భార్యకు ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధాల్లేవని వివరించారు. ఒక్క ఫొటోతో బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఎన్సీబీపై ఒత్తిడి తేవడానికేనని అన్నారు. తన అల్లుడు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడని, అందుకోసమే కావాలనే తన భార్య ఫొటోనూ బయటకు తీశారని ఆరోపించారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ కేసుల చుట్టూ వేడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. ఏకంగా శరద్ పవార్ పేరూ ట్విట్టర్లో ట్రెండ్ అయింది.