సోనియా గాంధీ పీఏ మాధవన్పై రేప్ కేసు నమోదు.. దళిత మహిళపై లైంగిక దాడి!
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పీఏ మాధవన్పై రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్లో ఆయనపై లైంగిక దాడి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కాగా, ఆ ఆరోపణలు అవాస్తవాలని మాధవన్ కొట్టిపారేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్పై రేప్ కేసు నమోదైంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్లో ఐపీసీలోని సెక్షన్లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.
జూన్ 25న పోలీసులకు అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పీపీ మాధవన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పర్సనల్ సెక్రెటరీగా పని చేస్తున్నట్టు సమాచారం.
ఈ కేసుపై సోనియా గాంధీ పీఏ మాధవన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధారమైన కేసులు అని, ఇది తనపై పన్నిన కుట్ర అని కొట్టిపారేశారు.
కొన్ని మీడియా కథనాల ప్రకారం, పీపీ మాధవన్ ఓ దళిత మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జాబ్ ఇంటర్వ్యూ అని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ దళిత మహళ భర్త గతంలోనే మరణించాడు. 2020లో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్లలో లేబర్గా పని చేసేవాడని తెలిసింది.