Asianet News TeluguAsianet News Telugu

Mumbai Cruise Drugs Case : ఆర్యన్‌పై కేసు, దర్యాప్తులో అవకతవకలు.. సమీర్ వాంఖడేపై చర్యలకు ఆదేశాలు

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు విచారణలో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీబీ మాజీ జాయింట్ డైరెక్టర్‌ సమీర్ వాంఖడేపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ఆరోపణలపైనా దర్యాప్తు జరగనుంది. 

center orders action against Sameer Wankhede for Shoddy probe in Aryan Khan case
Author
Mumbai, First Published May 27, 2022, 6:55 PM IST

ఎన్‌సీబీ (ncb) మాజీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే‌ (sameer wankhede) చిక్కుల్లో పడ్డారు. షారుఖ్ ఖాన్ (shahrukh khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (aryan khan) అరెస్ట్ సమయంలో ఎన్‌సీబీ జాయింట్ డైరెక్టర్‌గా సమీర్ వ్యవహరించారు. డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drugs Case) ఆర్యన్‌ను ఇరికించారన్న ఆరోపణలపై విచారణకు ఎన్‌సీబీ ఆదేశించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఆర్ధిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

సెంట్రల్ ఏజెన్సీ 6000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన తర్వాత శుక్రవారం డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత సమీర్‌పై విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. డ్రగ్స్ కేసులో పేలవంగా దర్యాప్తు చేపట్టినందుకు గాను సమీర్ వాంఖడేపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో పాటు ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ఆరోపణలపైనా విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. 

సమీర్ వాంఖడే నకిలీ కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన  వ్యవహారాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత (nationalist congress party) , మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (nawab malik) వెలుగులోకి తెచ్చారు. అనంతరం నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే ముస్లింగా జన్మించాడని.. షెడ్యూల్ కులాల (ఎస్సీ) కోసం రిజర్వ్ చేయబడిన సీటును ఉపయోగించి  సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి అతను నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని (fake caste certificate) సమర్పించాడని గతేడాది సమీర్ వాంఖడే ఆరోపించారు. 

Also Read:Drugs Case: ఆర్యన్ ఖాన్ ఎవరు..? డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఎలా లభించింది..?

ముంబైకి చెందిన సమీర్ వాంఖడే 2021 అక్టోబర్‌లో కోర్డెలియా  క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన ఎన్‌సీబీ సిబ్బందికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 22 మందిని అరెస్ట్ చేశారు. అయితే సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు  రావడంతో కేసు.. ముంబై జోన్ నుంచి ఎన్‌సీబీ కేంద్ర బృందానికి బదిలీ చేశారు. అంతేకాదు.. వాంఖడేను కేసు దర్యాప్తు నుంచి కూడా తొలగించడంతో పాటు అతనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. 

ఇకపోతే.. డ్రగ్స్ కేసుకు సంబంధించి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలను సేకరించలేకపోయినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఏజెన్సీ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో ఆర్యన్ పేరు లేదు. కోర్డెలియా డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు దర్యాప్తు సంస్థ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత సమీర్ వాంఖడే నేతృత్వంలోని తొలి బృందం వల్ల పొరపాటు జరిగిందని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ అన్నారు.

ఈ పరిణామాలపై ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది మనేషిండే మాట్లాడుతూ.. దాదాపు 26 రోజుల పాటు ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేసి నిర్బంధించడం అన్యాయమన్నారు. అతను ఎలాంటి డ్రగ్స్‌ను కలిగి లేనప్పుడు.. ఎలాంటి సాక్ష్యాలు లేనప్పడు అతని నిర్బంధం సరికాదన్నారు. సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కేసును దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాధారాలు లేనందున ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై సంతోషిస్తున్నట్లు మనేషిండే పేర్కొన్నారు. 

మరోవైపు వాంఖడే నేతృత్వంలో జరిగిన ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగినట్లు కథనాలు  వెలువడుతున్నాయి. ఈ కేసులో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని సమాచారం. అంతేకాకుండా ఒక సాక్షి నుంచి ఖాళీ డాక్యుమెంట్లపై సంతకం చేయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై ఎన్‌సీబీ స్పందించాల్సి  వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios