దారుణం... రిటైర్డ్ పోలీసు అధికారిని కొట్టి చంపారు
బైక్ దిగిన వెంటనే ఆయనపై కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన తీవ్రగాయాలపాలయ్యారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ సమాద్ ఖాన్(70) పోలిసు అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. రెండు రోజుల క్రితం రాత్రి పూట ఆయన ద్విచక్రవాహనం పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.
బైక్ దిగిన వెంటనే ఆయనపై కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన తీవ్రగాయాలపాలయ్యారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో రక్తస్రావంతో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే..గాయాలు తీవ్రంగా తగలడంతో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా.. ఈ సంఘటన మొత్తం దగ్గరలోని ఓ సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ అధారం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆయనపై దాడిచేసిన వారిలో ఒకరిపై గతంలో 10 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు సాగుతోంది.