అర్థనగ్నంగా ప్రదర్శన.. యాక్టివిస్ట్ పై కేసు
రెహానాపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆమె శృంగార సంబంధ అంశాలను ఎలక్ట్రానిక్ రూపంలో వ్యాపింపజేశారని, బాలలపట్ల క్రూరత్వం ప్రదర్శించారని ఆరోపించారు.
యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తన అర్ద నగ్న దేహంపై తన మైనర్ పిల్లల చేత పెయింటింగ్ వేయించుకుని, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు.
పటనంతిట్ట జిల్లాలోని తిరువల్ల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. రెహానాపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆమె శృంగార సంబంధ అంశాలను ఎలక్ట్రానిక్ రూపంలో వ్యాపింపజేశారని, బాలలపట్ల క్రూరత్వం ప్రదర్శించారని ఆరోపించారు.
స్థానిక బీజేపీ ఓబీసీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ వీడియోను ఎందుకు అప్లోడ్ చేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫేస్బుక్, యూట్యూబ్లలో ఈ వీడియోను ఫాతిమా అప్లోడ్ చేశారు. తాను కంటి వ్యాధితో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తన పిల్లలిద్దరూ తన దేహంపై పెయింటింగ్ వేసినట్లు పేర్కొన్నారు.
శబరిమల దేవాలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఫాతిమా ఆ దేవాలయంలోకి ప్రవేశించేందుకు 2018 అక్టోబరులో ప్రయత్నించిన సంగతి తెలిసిందే.