ఢిల్లీలో కూలిన భవనం: నలుగురు మృతి, ఆస్పత్రికి 13 మంది
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో నలుగురు మరణించారు. మరో 13 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. కింద కోచింగ్ సెంటర్ ఉండడంతో మరణాలు సంభవించాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న భవనం నిలువునా కూలింది. దీంతో శిథిలాల కింద పడి నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఢిల్లీలోని భజన్ పుర ప్రాంతంలో శనివారం సాయంత్రం ఆ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం కింద ఓ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. అందుకే మరణాలు సంభవించాయి. గాయపడిన 13 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
సంఘటనా స్థలానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ కు చెందిన పలు బృందాలు చేరుకుని సహాయక చర్యలను చేపడుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది.