Asianet News TeluguAsianet News Telugu

ముంద్రా పోర్టులో డ్రగ్స్ వ్యవహారంతో ‘అదానీ’ కీలక నిర్ణయం.. ఇరాన్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్గోకు నో

ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకునే, అక్కడికి సరుకులను పంపించే సేవలను తాము అందించబోమని, వచ్చే నెల 15వ తేదీ నుంచి ఈ దేశాలకు ఎగుమతి, దిగుమతి సేవలను విరమించుకోబోతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ముంద్రా పోర్టులో సుమారు రూ 21వేల కోట్ల హెరాయిన్ పట్టుబడ్డ తర్వాత అదానీ గ్రూప్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

adani to stop export and imports services to iran afghanistan pakistan from nov 15
Author
Ahmedabad, First Published Oct 11, 2021, 8:07 PM IST

అహ్మదాబాద్: అదానీ గ్రూప్స్ పరిధిలోని ముంద్రా పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత్త సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వ్యాపార వేత్త అదానీపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే adani groups సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి iran, pakistan, afghanistan నుంచి సరుకులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అదానీ పోర్టు, సెజ్ పరిధిలోని అన్ని టర్మినల్స్ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.

అదానీ పోర్ట్స్, లాజిస్టిక్స్ దేశంలోని పెద్ద కమర్షియల్ port ఆపరేటర్లలో ఒకటి. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, తమిళనాడు సహా ఏడు రాష్ట్రాల్లో 13 పోర్టులను ఈ సంస్థ కలిగి ఉన్నది.

పౌడర్ రూపంలో డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నుంచి ముంద్రా పోర్టుకు చేరింది. ఇరాన్ మీదుగా ఈ డ్రగ్స్‌ను విజయవాడకు చెందిన ఓ సంస్థ ఆర్డర్ చేసింది. ఈ డ్రగ్స్ పై ముందస్తు సమాచారాన్ని కలిగి ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా సుమారు మూడు వేల కిలలో హెరాయిన్ పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ. 21వేల కోట్లు పలుకుతుందని అంచనా. ఈ డ్రగ్స్ పట్టివేత దేశాన్ని కుదిపేసింది. అదానీ సంస్థలపైనా విమర్శలు వచ్చాయి.

Also Read: ముంద్రా పోర్ట్ అదానీది.. కాకినాడ పోర్ట్ విజయసాయిది.. డ్రగ్స్ రాకెట్‌ వెనుక ఏదో ఉంది: హర్షకుమార్ వ్యాఖ్యలు

ఈ విమర్శలకు సమాధానంగా అదానీ గ్రూప్ ఓ ప్రకటన చేసింది. తాము పోర్టులను ఆపరేట్ చేస్తామని, అందులో వచ్చే సరుకులను పరిశీలించే నిబంధనలు తమకు లేవని వివరించింది. ఆ డ్రగ్స్‌తో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ విమర్శలు ఆగలేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తును కేంద్ర హోం శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు అప్పజెప్పింది. ఈ కేసులో ఇప్పటికి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Also Read: గుజరాత్ డ్రగ్స్ కేసు: చెన్నైలో ఎన్ఐఏ సోదాలు.. ఏపీ దంపతుల అరెస్ట్

ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15వ తేదీ నుంచి ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లకు ఎగుమతి, దిగుమతి సేవలను తాము చేపట్టబోమని ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios