పాపం.. ‘ప్రమోషన్’ పోటీ.. తీసింది ప్రాణం
పోటీలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి
ఉద్యోగంలో పదోన్నతి( ప్రమోషన్) పొందాలని ప్రతి ఒక్క ఉద్యోగికీ ఉంటుంది. అందుకోసం శతవిదాలా ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రమోషన్ కోసం పెట్టిన పోటీలో పాల్గొని ఓ పోలీసు అధికారి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...జైపూర్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కోసం ఇటీవల కానిస్టేబుళ్లకు రాత పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి అవుట్డోర్ టెస్ట్, పీటీ ఎక్సర్సైజ్, డ్రిల్స్, కాంబాట్ టెస్ట్లు పెట్టాలని నిర్ణయించారు.
అవుట్డోర్ టెస్ట్లో భాగంగా శుక్రవారం ఉదయం 2కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఈ పోటీల్లో 45ఏళ్ల సుశిల్ కుమార్ శర్మ అనే హెడ్ కానిస్టేబుల్ కూడా పాల్గొన్నాడు. కాగా.. పరుగు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా సుశీల్ కుప్పకూలిపోయాడు. దీంతో అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రవీకరించారు.
సుశీల్ స్వస్థలం భరత్పూర్. ప్రస్తుతం ప్రతాప్నగర్ ప్రాంతంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. పరీక్షకు ముందు అభ్యర్థులకు వైద్యపరీక్షలు చేయించామని.. సుశిల్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలిందని... అయినప్పటటికీ సుశీల్ చనిపోవడం బాధాకరమని అధికారులు పేర్కొన్నారు.