యూపిలో మూడేళ్ల బాలికపై రేప్, హత్య: 20 రోజుల్లో మూడో ఘటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లఖీంపూర్ ఖేరీ జిల్లాలో మరో దుర్ఘటన జరిగింది. మూడేళ్ల బాలికను రేప్ చేసి, హత్య చేశారు. జిల్లాలో గత 20 రోజుల్లో ఇటువంటి సంఘటన జరగడం ఇది మూడోసారి.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో బాలికలపై అత్యాచారాలు, హత్య సంఘటనలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మూడేళ్ల బాలికపై గురువారం ఉదయం అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమెను హత్య చంపేశారు. గత 20 రోజుల్లో జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం ఇది మూడోసారి.
బుధవారంనాడు బాలిక అదృశ్యమైంది. ఆమె శవం ఇంటికి అర కిలోమీటరు దూరంలో కనిపించింది. తలపై తీవ్రమైన గాయాల ఛాయలు కనిపించాయి. తొలుత దాన్ని హత్య కేసుగా పోలీసులు భావించారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
సంఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్క గ్రామంలోని లేఖరామ్ మీద అతను అనుమానం వ్యక్తం చేశాడు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని అతను తన కూతురిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడని అతను ఆరోపించాడు.
నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. స్కాలర్ షిప్ ఫారం నింపడానికి బయటకు వెళ్లిన 17 బాలిక శవమై తేలిన ఘటనతో లఖీంపూర్ ఖేరీ జిల్లా వార్తల్లోకి వచ్చింది. ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారని భావిస్తున్నారు. ఆ సంఘటనకు ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికను రేప్ చేసి, ఆమెను చంపేశారు.