విద్యుత్తును ఆదా చేసే చర్యల వల్ల మనకు రెండు ప్రయోజనాలు సమకూరుతాయి. ఒకటి డబ్బు ఆదా, రెండోది గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడం. కొన్ని స్మార్ట్ గాడ్జెట్లు, సులభ చిట్కాల ద్వారా విద్యుత్‌ను ఆదా చేసి ప్రతి నెలా ఎలక్ట్రిసిటి బిల్లును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూస్తే, 

మీరు ఎక్కువ కాంతివంతంగా ఉండే బల్బులను ఉపయోగిస్తుంటే, వాటి స్థానంలో సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ లైట్లను బిగించాలి. ట్యూబ్ లైట్ల వినియోగం అధికంగా ఉండే కిచెన్, బెడ్‌రూమ్‌లలో ఎల్‌ఈడీ, టీ5 బల్బులను అమర్చాలి. అవసరం లేనప్పుడు ఎటువంటి లైట్లనైనా ఆపివేయడం శ్రేయస్కరం. 

లైట్ల వినియోగంలో అనుసరించిన విధానాలనే ఫ్యాన్ల విషయంలోనూ ఫాలో అవ్వాలి. కొత్త ఫ్యాన్‌ను కొనుగోలు చేస్తుంటే గనుక, శక్తివంతమైన వాటిని కొనడం ముఖ్యమైన సూచన. ఇంట్లో ఫ్యాన్లను 12 గంటలకు మించి ఉపయోగిస్తుంటే, వాటి స్థానంలో శక్తివంతమైన ఫ్యాన్లను బిగించండి. తద్వారా మీరు ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బును తిరిగి రెండేళ్లలోనే పొందవచ్చు. 

అలాగే టీవీ దాని అనుబంధంగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులైన (సెటప్ బాక్స్, సౌండ్ స్పీకర్లు మొదలైనవి) అవసరం లేనప్పటికీ ఆన్ చేసే ఉంచుతాము. దీని వల్ల ఎలక్ట్రిసిటి ఖర్చవ్వదని చాలా మంది భావిస్తారు. కానీ ఈ విధానం తప్పంటున్నారు నిపుణులు. టీవీని చూడనప్పుడు పైన పేర్కొన్న వస్తువులను ఆఫ్ చేయడం మంచిది.

మీ రిఫ్రిజిరేటర్‌ను గోడకు అర అడుగు దూరంలో ఉంచాలి. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లు వేడిని బయటకు నెడతాయి, ఆ వేడిని వెలుపలకు పంపకపోతే వాటి సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇకపోతే మీ రిఫ్రిజిరేటర్‌లో ఏమాత్రం ఖాళీ లేకుండా ఆహార పదార్థాలను నింపడం శ్రేయస్కరం కాదు.

శీతాకాలంలో, మీరు ఫ్రిజ్‌ను వన్ మినిట్ కూల్ మోడ్‌లో ఉంచవచ్చు. రిఫ్రిజిరేటర్‌లలోని కంటైనర్లలో తక్కువ ఆహారం ఉంటే, దానిని ఖాళీగా ఉంచకుండా మరి కొన్నింటితో నింపండి. ఎందుకంటే ఫ్రిజ్.. కంటైనర్‌‌ను చల్లగా ఉంచేందుకు పెద్ద మొత్తంలో శక్తిని వినియోగిస్తుంది.

స్నానం చేయడానికి గంటల ముందే గీజర్‌లను ఆన్ చేయవద్దు. అలాగే స్నానం చేసిన వెంటనే దానిని స్విచ్ ఆఫ్ చేయండి. కొన్ని రకాల గీజర్లలలో ఆటో ఆఫ్ ఫీచర్లు ఉంటాయి. అయితే ఇలాంటి వాటి వల్ల విద్యుత్ వృథా అవుతుంది. వీటిలో నీరు వేడిగా ఉన్నంత సేపు గీజర్ ఆఫ్ మోడ్‌లో ఉంటుంది.. ఎప్పుడైతే నీరు చల్లబడుతూ ఉంటుందో అప్పుడు గీజర్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. 

డబ్బును ఆదా చేయాలనుకునే వారు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశం ఎయిర్‌ కండిషనర్లు (ఏసీ). ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఏసీలు ఆన్ చేసినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేశారా లేదా అన్నది ముందుగా చూడాలి. ఏసీలను ఉపయోగిస్తున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేసినట్లయితే అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచేందుకు సాయపడుతుంది.

భారతదేశంలో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న వారు ఏసీలను ఉపయోగిస్తుంటే ఈ అలవాటును మార్చేందుకు ప్రయత్నిస్తే బెటర్. 

వీలైనప్పుడల్లా ఏసీలను ఉపయోగించడానికి బదులు కిటికీలను తెరవడం మంచిది. ఏసీని ఆన్‌ చేసిన వెంటనే చల్లబడాలనే ఆశతో తక్కువ ఉష్ణోగ్రత ఉండే మోడ్‌లో ఉంచవద్దని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పూట ఏసీని ఆన్ చేసి.. రూమ్ చల్లబడిందని అనిపిస్తే వెంటనే రెండు, మూడు గంటలు స్విచ్ఛాఫ్ చేయాలి. ఏసీల కాలవ్యవధి ముగిసిన వెంటనే వాటిని వెంటనే రీప్లేస్ చేయాలి. ఎందుకంటే పాత ఏసీలు పనిచేసేందుకు పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం అవుతుంది.