తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశేషమైన స్థానం ఉంది. ప్రమోద్ అవంచ రాసిన నువ్వు వస్తావ్ కదూ కవితను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.

మేఘాలతో చెప్పి ఆకాశాన్ని
కప్పుకోమని చెపుతా

అప్పుడప్పుడు వచ్చే
మెరుపులకు చెప్పి నీ
దారి పొడవునా వెలుగులు
పరచమని, చెపుతా

పిడుగు తో చెప్పి శబ్దం
తక్కువగా చేయమని
చెపుతా

వరుణుడుతో చెప్పి
సన్నటి జల్లులను
కురిపించమని
చెపుతా

ఆకాశంతో చెప్పి ప్రకృతిని
అంతా నీ అధీనంలోకి
ఇవ్వమని చెపుతా

చీకటిగా వుందంటావా
అవును
నీకు చీకటంటే భయం
కదా

పౌర్ణమి చంద్రుడికి చెప్పి
నీకోసం నక్షత్రాల పల్లకి
పంపమని చెపుతా

నువ్వు వస్తావు
కదూ.....

నన్ను పలకరించి పోతావు
కదూ.....