మెర్సీ మార్గరెట్ తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవయిత్రి. ఆమె రాసిన మండే వృక్షం కవితను ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం అందిస్తున్నాం.
అగ్ని గోళం మండుతూనే ఉంది
ఆటలాడే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు
Add Asianetnews Telugu as a Preferred Source

చినిగిన వస్త్రాలు
ఇంకా రక్తపు మరకలు పోగొట్టుకోలేదు
చేతిగీతల్లో కొత్తవేవో వచ్చి చేరాయి
మెట్లన్నీ అడుగులను లెక్కిస్తూనే ఉన్నాయి
ఒకరి పాదాలను మాత్రం
అవి ఇష్టంగా ముద్రించుకున్నాయి
గాలీ నీరు
నింగీ నేలా
ఎప్పుడూ ఒక్కలా లేవు
అతడి చుట్టూ పిడికిళ్ళు పిడికిళ్ళయి
పహారా కాస్తున్నాయి
నేల మీద పడ్డ అన్నం మెతుకులు
కోడిపిల్లల్లా తిరుగుతుంటే
కరుచుకు పోడానికి వచ్చిన గద్దలకి అతడి దేహం
మండే వృక్షంలా అడ్డు తగులుతుంది
కాలం నావలో
అతడు ఆవలిగట్టుకు వెళ్ళాడు
ఈవలి గట్టుకు
అతడి పేరున స్మృతి స్తూపం వెలిసింది
అతడు మాత్రం మరో యుద్ధం కోసం
ఆయుధంలా పదునవటానికి మౌనంవహించాడు
మరింత తెలుగు సాహిత్యం కోసం: https://telugu.asianetnews.com/literature
