తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఉన్న ప్రత్యేకత విశేషమైంది. బాలబోయిన రమాదేవి రాసిన స్వప్న సమీరం కవితను తెలుగు సాహిత్య పాఠకుల కోసం అందిస్తున్నాం

గమ్మత్తుగా ప్రతీరేయి
నా కళ్ళతలుపులు మూసీమూయంగానే
ఇంకో లోకానికి ద్వారాలు తెరువబడుతాయి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దినమంతా శ్రమించిన తనువునుండి
నాకు నేనుగా వేరైపోయినట్లు
నిశిరాతిరి దారుల్లో ప్రయాణిస్తూనే
వెలుగులోకాల సందర్శనం చేస్తూంటాను

అక్కడక్కడ తారసపడేవాళ్ళు
లోకంలో నాతో ఉండేవాళ్ళు
నన్నిడిచిపెట్టిపోయినోళ్ళూ
సమావేశమైనట్లు సందడిచెస్తారు

ఓసారి గతానికీ 
మరోసారి వర్తమానానికి
ఇంకోసారి భవిష్యత్తుకూ 
మధ్యన తిరుగుతూ 
వాస్తవాస్తవాలను గ్రహిస్తూంటాను

అదేమిటో గతం మధురంగా
ప్రస్తుతం కఠినంగా
భవిష్యత్తు ఆశాజనకంగా 
దృశ్యమానమై కళ్ళవెనుక తెరపైఆడుతుంటుంది

సరిగ్గా అప్పుడే...
తెల్లారింది లెమ్మంటూ 
అమ్మ కుదిపిన కుదుపుకి 
ఆలోచనలన్ని అదుపులోకి వచ్చి
వర్తమానమంతా స్వప్నదూరమై
మళ్ళీఈలోకంలోకి వచ్చిపడతాను....

రాత్రి నాలో వీచిన స్వప్నసమీరాల హాయిలో నిజంచేయాలన్నతపనతో!!