Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సాహిత్యం: కాళోజీ భావకవితా మధురిమలు

ప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావు కవిత్వం గురించి తెలియనివారుండరు. ఆయన కవిత్వంలో ధిక్కార స్వరం ఉంటుంది. అయితే ముదిగొండ సంతోష్ కాళోజీ కవిత్వంలోని భావికవిత్వ మధురిమలను చవి చూపిస్తున్నారు.

Mudigonda Santhosh on Kaloji poetry
Author
Hyderabad, First Published Sep 11, 2020, 3:33 PM IST

అన్యాయం అంతరిస్తే  నా  గొడవకు ముక్తి ప్రాప్తి.  అన్యాయాన్ని ఎదిరించి వాడు   నాకు ఆరాధ్యుడు.  అంటూ అన్యాయం పై  ఎక్కుపెట్టిన విల్లు అతను. అది స్థానికమైన , జాతీయమైన , అంతర్జాతీయమైన వసుధైక కుటుంబంలో  ఎక్కడ అన్యాయం కనిపించినా  అక్షరమై వాలిపోయేవాడు. తన  అస్తిత్వమైన స్వభాష , స్వదేశము,   అంటే  వల్ల మాలిన  ప్రేమ. తెలంగాణ మాండలికానికి సంస్కృతికి   నిలువెత్తు సంతకం కాళోజి .   అందుకే ఆయన జయంతిని  తెలంగాణ భాషా   దినోత్సవంగా జరుపుకుంటాం.  ఆక్రోశం అసహనంలోంచి పుట్టుకొచ్చిన గొడవ.     పీడితుల కోసం అన్యాయానికి బలైపోయిన వారి  కోసం దుఃఖింపబడతాడు ఎదిరిస్తాడు ,  నినదిస్తాడు.  సమాజంలో ఎక్కడ ఏ  రకమైన  సంఘటన జరిగిన ప్రతి స్పందిస్తాడు.  

బలహినుల పీడితుల బాధితుల పక్షాన నిలబడి  రాజ్య హింసను ప్రశ్నించిన గొంతుక ఆయనది  హింస తప్పు అని చెబుతూనే ప్రతిహింస తప్పు కాదు అని ప్రబోధిస్తాడు. సత్యాగ్రహలే చేయాలి  కానీ సత్యాగ్రహం వల్ల  రాక్షస ప్రవృత్తి లో  , నియంతృత్వ దోరణిలో   పరివర్తన జరగనప్పుడు ప్రతిహింస తప్పుడు.
తప్పు కాదు అని చాటిన అభ్యుదయవాది. 

“అవనిపై జరిగేటి  అవకతవకలు చూచి ఎందుకో నాహృదిని ఇన్ని ఆవేదనలు. పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె మాయమోసము చూచి మండిపోవును ఒళ్ళు". మరి అవకతవకలను సవరించే శక్తిసామర్థ్యాలా? అవి లేవు. “తప్పుదిద్దగలేను, దారి జూపగలేను తప్పు చేసిన వాని దండింపగాలేను అవకతవకలనేను సవరింపలేనపుడు పరుల కష్టాలతో పని యేమి నాకనెడు అన్యులను  జూసినా  హాయిగా మనలేను." ఇట్లా వుంది నా మతి-గతి. అని  లోకం గోడుని తన గోడవగా చేసుకొని  అక్షరాల ఆవేదనను ఎగరేస్తాడు.

ప్రేమ, కోపం ద్వేషం, అభిమానము, ఘర్షణ, సంఘర్షణ, ఆత్మీయం , పోరాటం ఉద్యమం, ఆవేశం, ఆరాటం ఏదైనా అక్షరమై నిలవాల్సిందే.

తనకు స్వేచ్ఛ కావలి. తన అస్తిత్వాన్ని చాటుకునే హక్కుకావాలి. తానుఎలా  ఉన్నాడో అలానే ఉండాలనుకుంటారు. పరాయీకరించబడిన  వేషము , భాష పై  ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు.ఎన్నెన్ని ఇజాల గతులు. ఏదో సూత్రానికి తత్వానికి, ఇజానికి కట్టుబడిపోయి జీవిస్తున్న ప్రాణులకు స్వేచ్ఛాజీవనం సున్న, పరాయి  భావాలు, పరాయి చూపులు, పరాయి చెవులు, పరాయి బాస, పరాయి నడక, పరాయి చేతలు అన్నీ పరాయివే  అందుకే  

( నరుడనేను, నరుడ నేను, మనిషి బ్రతుకు బ్రతుకుతాను
నా ఇష్టం వచ్చినట్లు నా మనసుకు నచ్చినట్టు / మాట్లాడుతా రాస్తా ప్రకటిస్తా / నా ఆలోచన నాది
అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్న / సభ్య ప్రపంచం సున్నా
నా మతమును ప్రకటిస్తా / ఆది నా స్వతస్సిద్ధమైన హక్కు / జన్మ హక్కు
ఆ మాత్రం లేకుంటే నీ బ్రతుకెందుకు? అని ఎదిరిస్తాడు.  (సంభాషణ-పే. 206)

ఆయన ఒక పోరాట యోధుడు , ప్రాణం పట్ల ,  బతుకు పట్ల మమకారం విలువ గౌరవం ఉన్నవాడు.  నిజమైన కవి ఎప్పుడూ ప్రతి పక్షంలో ఉండేవాడు.
సమాజానికి తనకూ సామరస్యం కుదిరే దాకా (అంతర బహిక యుద్ధం చేస్తూ యుద్ధరావాన్ని
కవిత్వంగా ఆలపించేవాడు.  ఆయన కవితలలో సమాజం లోని  సమస్యలు సంఘటనలు, సందర్భాలు,స్పందనలు ఇవే అత్యధిక స్థానం ఆక్రమించాయి.   కాళోజీ తన కవిత్వం ఎలా ఉండాలని కోరుకుంటాడో చూద్దాం.
నాకున్నది కోరిక / నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని / చదువురులకు కవిత్వంగా ఉండాలని భావుకులకు మెదడుగా ఉండాలని / మేధావులకు ఎడదగా ఉండాలని
తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని / అమాయకులకు ఆపద గుర్తించేదిగా వుండాలని,  కవిత్వం కేవలం భావోద్రేకం, ఆవేశోద్వేగంకాదు కాళోజీకి. చదువురుల వరకు అది ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరేసుకునే ఆవేశంగానే ఉండాలి గానీ భావుకులకు బుద్ధిబలాన్నీ, మేధావులకు హృదయస్పందలను, తార్మికులకు భావోద్వేగాలను కలిగించేదిగా ఉండాలని అరుదయిన సమ్మేళనాన్ని ఆయన కవిత్వం నుంచి, తన కవిత్వం నుంచి ఆశిస్తున్నారు.
కాళోజీ కవిత్వం అంటే సమకాలీన చరిత్ర నిలువుటద్దం.
ఆయన జీవించిన కాలపు ఉద్యమాలు రాజకీయాలు, ఆర్థిక , సామాజిక , సాంఘిక జీవన దృశ్యాలు ఆయన కవిత్వం.

అయితే కాళోజి కవిత్వం  అంతా కరడుగట్టిన  రాజ్యహింసపైకత్తుల వర్షమేనా ? మార్దవముమృదుత్వము   మెత్తని  సుతిమెత్తని  తావులు వెన్నెలలు సుగంధాలు లలేవా       ఒక మనసుకు  కరిగే గుణం ఉంటే,   అక్రమాలకు, అన్యాయాలకు అసాంఘిక  చర్యలకు మనసుమరిగి భావోద్యోగానికి  గురై   అక్షరాలకు  ఎరుపు ఎలా  అద్దగలడో,  ఉదయిస్తున్న లేలేతభామని కిరణాలకు, రెక్కలు విచ్చుకు ఎగురుతున్న  సీతాకోక చిలుకలవయ్యారానికి కరిగిఅక్షరాలను  ఇంద్రధనుస్సుపై నిలబెట్టుగలడు. కాళోజీ కవితల్లోను (స్త్రీ, పురుష సంబంధాల గురించి  వలపు  , ప్రేమ గురించి దాంపత్య జీవితం  గురించి  కవితలు ఉన్నాయి
సున్నిత భావాలను  మెత్తని రాగాలకు పలికించాడు.

దానిమ్మ గింజలోదాగిన యెరుపు / లేత  అరిటాకులపై  నునుపు/ ముసి ముసి నవ్వుల కుసుమముల సాంపు  / అందచందాలలొల్కు   ఆనందరరులు-  అన్నీ  చంటిపాపని పెదవి జంట సింగిణులలో ఆటలాడుతున్నాయి అంటదు.   ప్రకృతిలో అందాలు, వెలుగులు తేనె ఇవన్నీ  పసివాడి పెదాలపై   ఆటలాడుతాయి   పసివాడిని   ప్రకృతికి ప్రతీకగా చూపాడు.

ఆధునిక ఆర్భాటమందడిగి అవని యే / ఆత్మ జచ్చి జనుల అడవియైనాది /   మానవుని హృదయంబు మలినమైనది." /    మనిషి హృదయం మైలపడ్డదని  అవేదన  . ఆధునిక పోకడలన్ని ఆర్భాటాలే  కానీ అసలు  లేను. అసలైన ఆనందం పొందలేని మనుషులు  ఆత్మలేని వారు.  మనిషిలో నీతి నిజాయితితడి లేకపోతే అతను ఆత్మలేని శరీరమే కదా వస్తుగాలంలో ఇరుక్కొని బంధాలను దూరం చేసుకున్న  మనిషి  ప్రయాణం  ఎండమావుల వెంట. 

రేపు ఈ పాటికి ఎవ్వరెక్కడనో? / తుఫానులో తెప్ప దోనెల జంట /  కామతృష్ణల తృప్తి కోరు వేహాలు / దేహాల దాహాలు తీర్చ జంకేల?/   వయస్సు పై బడిన తరువాత, ఎవరెప్పుడు రాలిపోతారో తెలవదు సమయాన్ని సద్వినియోగం   చేసుకోవాలి,  అందుకే మోహాలు  జనియింప  మొగ మాట  మేలా?  అంటారు. అవసరము కవితలో  ప్రస్తుతమే  జీవితం , రేపు  ఉంటామో  లేదో  ఈ  క్షణం  లో  తృప్తిగా  జీవించాలి . 

ఉన్న వంకల దిద్దిపోయేటి  మిషతో /లేని వంకల తెచ్చి పెట్టేటి  వయసు,
మాట  మంతో తిక మంత్రాలు లేక
మానసాంబుధులచే  మధియించు వయసు/
వయస్సులో ఉన్నప్పుడు ఉండే  భావాలు
'కంటి చూపుల వాడి కవ్వాలనాడించి/
గడుసు గుండె లోతు కన్పెట్టు వయసు./   వయసు అనేది మనసుని కలచి వేస్తుంది. ఆ మరుసు చేసే మాయ అంత ఇంత కాదు.  ఉన్న వంకల దిద్దిపోయేటి  మిషతో /లేని వంకల తెచ్చి పెడుతుంది. శరీరంలో జరిగే భౌతిగా మార్పులు, మానసిక మార్పులకు కారణం వయసు. వరుసులో ఉండే విరితపు కోరికలు, ఆలోచనలు సర్వసాధారణం. కాళోజి  కూడా
వయసు  ప్రభావం నుండి తప్పించుకోలేదు.
కంటి చూపులే వాడిమైన కవ్వాలు/
నునసుని చితికి ప్రేమ అనే వెన్నెను  అరాగిం చేస్తారు. అని వయసు చేసే చమత్కారం  చిత్రిస్తారు. 
చెమ్మగిలిన కన్నులలో/
కమ్మలెన్నో చదివినాను/
మునుపు తిరిగిరాదు/
నలుగిరి వలె మనము కూడ/
చిత్తము  ఎపుడూ  నీదే  సొత్తు /
చెత్త ఇపుడు పరుని తొత్తు/ 
తాళి పేర తలుగు  పడగ/
చెదరలేదు ప్రేమ పటము/
ప్రేమించి విడిపోయిన మనసుల వ్యధను చిత్రించాడు . కాలం కత్తిగట్టి భౌతికంగా  విడదీసిన
మానసికంగా  ఎప్పటికీ ఒక్కటి.  కులాలు, మతాలు అంతరాల వలలో చిక్కి చితికి పోయినవారు ఎందరో. కని హృదయం ఎదుటి వారి బాధకు కరుగుతుంది.  అది మానసికమైన , శారీరకమైన,

నేనూ నవూ కలియ/
నీవెవరో ? నేనెవరో?/
ఎరుగు సామర్థ్యంబు/
ఏరికుండును సఖుడ?/
దాంపత్య జీవనం. ఆలు మగలు పాలు నీళ్లవలె కలిసిపోము అద్వైత స్థితిని పొందాలి. ఆ స్థితిని  పొందిన జంటలో నీవు, నేను అనే భేదం ఉండదు. అంటే ఇరువురి మనస్సు ఒకేలా స్పందించడం.  ఒకేలా ఆలోచించడం.
భావార్ణవంబులో/
నా వరకు నేను/
మునకలేసినయంత/
మునుపు ఇపుడౌను.
మనిషికి మనస్సు అనేది సమస్తం. మనసు  చేసే ఆలోచననే భావము. పిలింగ్స్ .  
మట్టి బొమ్మల్లో రాతి విగ్రహాల్లో చి త్రపటాల్లో  దేవుణ్ణి   భావించి పారవశ్యం పొందుతాము
ఒక ప్రేమికుడు తన ప్రియురాలి గురించి  తలపోస్తూ భావనా సముద్రంలో ము మునకలేసి
యెంతా గానో మురిసిపోతాడు . ఆ జ్ఞాపకాలు   స్మృతులు తీపి గుర్తులు తనను ఆ సమయంలో
విహరింపజేస్థాయి. మనసు ఆనందంతో  ఉప్పొంగుతుంది.
అప్పటి సమయాలకు తానుపరకాయ ప్రవేశం చేసి ప్రత్యక్షానుభూతి పొందుతాడు. 
పాపినా నా వంత  పాపి కండ్ల?/
కన్ను బడినంతనే కడదొలిగి   దాగెదవు./ 
అందాలు చూచుటకు అల్లాడు   నా మనసు/
అందమా నా వల్ల అపచారమి మాయె?/
ప్రేమికుడుతన ప్రేయసిని చూడాలని తహతహలాడుతాడు తన అందాలలో మునిగి లోకాన్ని
మరచిపోవాలని తపిస్తుంటాడు. మనసారా తనను  చూద్దామంటే
నిలువక  పారిపోతున్నది అని ఆవేదన  వ్యక పరుస్తాడు.
జింక కన్నులు చూచి చెదురునాగుండె/  చూపుల  సొగసైనా చూడలేనా నేను ./ అంటూ  ప్రియురాలిని వర్ణిస్తునే తన మనసు చలించింది అంటాడు కవి.

మానసిక ఖేలనల స్థానమే జగము మహిని పేచీలన్ని మనసు పేచీలే   మనస్సే అన్నింటికి కారణం. కన్నీళ్ళైనా , కవ్వింతలైనా  తుళ్లింతలైన  మనసు చేసే  చేష్టలే అంతా.  కోరికలు,  వాంఛలు ఆశలు  ఆశయాలు ఇవన్ని మనస్సు చేసే మాయ  మనోభావాలకు ప్రతిబింభమే ఈ జగత్తు . అప్పుడే  నవ్వుతుంది,  వెంటనే  ఏడుస్తుంది. ఏవో  పురాలోచనల సుడిగుండంలోగిరగిరా తిరిగి  నొచ్చుకుంటుంది.   మనసు  చిత్తం ఎవరికి తెలియదు.

అక్కడ  నా తలపుల చేతులు నీ  కొప్పులో
పూదండను   సవరిస్తున్నప్పుడు
నీ తలపుల మునివేళ్ళు 
నా మెడను గోము చేస్తుంటాయి.
నిలువుటద్దం ముందట
నీవు సింగారించుకుంటున్నప్పుడు
ప్రతిబింబు కళ్ళు   నా  చూపులతో
సవరణ సలహాలను  అందిస్తుంటాయి. 

భావ   కవిత్వాన్ని   ఎంత   హృద్యంగా   పలికించారు   ఈ  కవితలో.   ప్రేయసి  ప్రియుల  మధ్య  జరిగే   అదృశ్య  సరసం .   తలపులతోనే  ఎంతో పులకింతలు. ఎక్కడో దూరాన ఉన్న ఆమె కొప్పులో పూల దండ అయన తలపులు  సవరిస్తున్నాయి. ఆమె  తలపులు   సుతిమెత్తని  వేళ్ళుగా అతని మెడను  గోముగా  ప్రేమగా  స్పర్శిస్తున్నాయి. ఆమె అద్దం లో చూసుకుంటున్నప్పుడు ఆమె ప్రతిబింపపు  కళ్ళు   ఆయన  చూపులై ఆమెను సింగారిస్తున్న వి  ఎంతటి  భావుకత.  వలపుని తలుపుని  ప్రేమను ఒలికించారు. కాళోజి అంటే  కాలుతున్న నిప్పే కాదు, విచ్చుకున్న  పువ్వు కూడా.నిరసన,ధిక్కారం, ప్రతిఘటన, ఆవేదన, ఇవే కాదు సున్నితమైన భావాలనూ  చిత్రించింది అయన కలం. 
  మనిషిని  ప్రేమించినవాడు  కాళోజీ .మట్టిని పూజించి,  అస్తిత్వాన్ని  నెత్తికెత్తుకొని మనిషినిజెండా కర్ర గా నిలపాలని నిరంతరం మంచి  కోసం మనిషి కోసం తపించినవాడు.సమాజంలో చుట్టూ ఉన్న చీకటిపై అక్షరాయుధాన్ని  సంధించి    సమకాలీన దుర్నీతిని  కవిత్వికరించి  లోకం గోడుని  తన  గొడవగా ఎత్తుకొని పోరాడిన ప్రజాకవి కాళోజీ.

- ముదిగొండ సంతోష్

Follow Us:
Download App:
  • android
  • ios