Asianet News TeluguAsianet News Telugu

ఇంకా కొనసాగుతూన్న 'విషాద కామరూప'

అస్సాంలోని ప్రసిద్ధ వంశమైన ఒక గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాధ  ఇతివృత్తంగా కొనసాగిన నవల 'విషాద కామరూప'పై పు‌స్తక సమీక్ష

Jwalitha Reviews Vishada Kamaroopa book
Author
Khammam, First Published Jul 29, 2020, 3:16 PM IST

"విషాద కామరూప" నవల అస్సాం రాష్ట్రంలోని, కామరూప జిల్లాలోని, ఒక మారుమూల 'సత్త్ర' అని పిలువబడే వైష్ణవ మఠాల చుట్టూ ఉన్న చిన్న గ్రామం.

ఆనాటి సత్రాల దయనీయ స్తితితో పాటు, అస్సాం సంస్కృతిలోని ప్రతి సూక్ష్మ అంశాన్ని 'కామరూప' అనే మాండలికంలో ఇందిరా గోస్వామి "ఊనే ఖోవా హౌదా" అనే అద్భుతమైన నవలగా రాసారు. కామరూప మాండలిక భాష చాలా తక్కువ మందికి వచ్చు కాబట్టి. దానిని తిరిగి ఇంగ్లీషులోకి "ఏ సాగా ఆఫ్ సౌత్ కామరూప" అనే పేరుతో అనువాదం చేయవలసి వచ్చిందని రచయిత్రి తన ముందు మాటలో చెప్పుకున్నారు. దానికి తెలుగు అనువాదం చేసినవారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. 'కేంద్ర సాహిత్య అకాడమీ' 2002వ సంవత్సరంలో మొదటిసారి ఈ నవలను ప్రచురించింది .

19వ శతాబ్దం ప్రథమ భాగంలో 1820 మొదలు బ్రిటిష్ పాలన అంతరించి భారతదేశం స్వాతంత్రం పొందేదాకా సుమారు 125 ఏళ్ల పాటు ఈ నవల ఇతివృత్తకాలం.

అస్సాంలోని ప్రసిద్ధ వంశమైన ఒక గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాధ ఈ నవలకు ఇతివృత్తం. గోసాయిలు లేదా గోస్వామీలు అస్సాంలోని ఉన్నతమైన జాతి వారు. వారికి మతాధిపత్యం కూడా ఉండేది. సత్త్రల్లో ప్రజలు వారిపట్ల విశేష గౌరవం చూపేవారు. వైష్ణవ మఠాన్ని సత్త్ర అంటారు. గోస్వామీలే ఆ సత్త్రలకు అధికారులుగా ఉండి ఆధ్యాత్మిక, సామాజిక ఆధిపత్యాన్ని కలిగి, సంస్థానాధీశులుగా విస్తారమైన భూములపై ఆధిపత్యాలను కలిగి ఉంటారు. మఠంలోని భక్తులు , శిష్యులే కాక అన్ని మతాల ప్రజలు వారిని గౌరవించేవారు. పాలనాధికారులు కూడా వీరీకి విశేషాదరణ కల్పించేవారు.

సత్త్రాలకున్న విస్తారమైన భూముల్లో ఎక్కువ భాగం అస్సాంను పాలించిన "అహోమ్ మహారాజులు" దానంగా ఇచ్చినవే .
వైభవంగా విలాసవంతంగా జీవించే గోస్వాములు స్వాతంత్ర్యానంతరం భూసంస్కరణల వలన వారి భూములపై అధికారాన్ని హక్కును కోల్పోయారు. అటువంటి 'రాజపుఖూరి సత్త్ర' అనబడే ఒక వైష్ణవ మఠంలో జరిగిన కథాంశం "విషాథ కామరూప" నవల.

ఈ నవలలోని స్త్రీ పాత్రలన్నీ దాదాపు దక్షిణ కామ రూపాలో ఉన్న గోస్వామి కుటుంబాలలో స్త్రీలు, మరియు వారితో కలిసి సేవకులుగా ఉన్న స్త్రీలే. వితంతువులు, వారి అపరిమిత దుఃఖాలు, వారిని అణచివేసే సామాజిక నిర్బంధాలు ఆత్మీయంగా ఎంతో సహానుభూతితో చిత్రించారు రచయిత్రి.

అమెరికన్ బాప్టిస్టు మిషన్ 1936 లోనే అస్సాంలో అడుగు పెట్టి కామరూప జిల్లాలో కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించగలిగింది. అయితే బ్రహ్మపుత్ర లోయలోని ప్రజలలో మత మార్పిడి వారికి సాధ్యపడలేదు. కారణం, సత్త్ర అనబడే వైష్ణవ మఠాల వల్ల ప్రజలలో వైష్ణవం అధికంగా పాతుకుపోయి ఉండటం. అయితే భారతదేశ సాహిత్య సంపదకోసం ప్రాచీన వ్రాతప్రతులను, ముఖ్యంగా తంత్ర శాస్త్రం గ్రంథాలను సేకరించేందుకు బాప్టిస్ట్ కార్యకర్తలు వైష్ణవ మఠాలకు వెళ్లేవాళ్లు. ఆ విధంగా చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న వైష్ణవ గోసాయిని గిరిబాల, మార్క్ అనే ఒక క్రిస్టియన్ మత బోధకుని ప్రేమకు ఆకర్షితురాలవుతుంది. చివరకు ఆమె ప్రేమ విషాదంగా ముగిసింది. ఒకరోజు రాత్రి మార్కుతో కలిసి ఒక కుటీరంలో వ్రాతప్రతుల గురించి మాట్లాడుతూండగా ఆమెను బయటకు ఈడ్చి, ఆమె చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటారు. ఆ ప్రాయశ్చిత్త కర్మలో భాగంగా మండుతున్న పాక నుండి ఆమె బయటకు రావాలి. కానీ ఆమె అందుకు ఇష్టపడక స్వచ్ఛందంగా మరణాన్ని ఆహ్వానిస్తుంది. తప్పించుకునే అవకాశమున్నా పాక తోపాటు కాలిపోతుంది. అది ఆనాటి బహిరంగ పరువుహత్య.

మానవ సమాజంలో మనుషులను తోడేళ్ళుగా, ఎనుములుగా విడదీసేది మతం ఒక్కటే.

ప్రస్తుత సమాజం మద్యం కబంధహస్తాల మత్తులో నలిగిపోతున్నట్టే , ఆ రోజుల్లో గ్రామాలన్నీ సత్త్రలతో సహా నల్లమందు విషపు కోరల్లో చిక్కుకొని ఉండేవి. భయంకరమైన నల్ల మందు అలవాటు దారిద్ర్యంలో మగ్గుతున్న స్త్రీ పురుషులను సర్వ నాశనం చేసేది. అధికారులు గోస్వాములు సంపన్న జీవితాలను గడిపే వారు. వారి శిష్యులైన జమిందారీ ప్రజలందరూ అజ్ఞానంతో మూఢనమ్మకంతో వారిని గుడ్డిగా అనుసరించే వారు.

నేటి ధనవంతులకు భారీ వ్యాపారులకు వ్యక్తిగత విమానాలు , కోట్ల ఖరీదైన వాహనాలు, విల్లాలు వారి అంతస్తులకు హోదాకు సూచికలైనట్టే,
భారీ పనుల కోసం అధికారులు ఏనుగులను పోషించేవారు అవి వారి అంతస్తుకు అధికారానికి సంపదకు సంకేతాలుగా ఉండేవి. 'అధికార్' (ఆఫిసర్లు కాదు మఠాధిపతులు) పెళ్ళిళ్ళకు వెళ్ళేప్పుడు ఏనుగులను వైభవంగా అలంకరించి వాటిపై అట్టహాసంగా వెళ్లేవారు. వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఏనుగులను వాడేవారు. వాటిని ప్రయోగించి అడవి ఏనుగులను పట్టుకొని వాటికి  శిక్షణనిచ్చి అమ్మేవారు లేదా వస్తు మార్పిడి విధానం క్రింద ఇచ్చేవారు. దక్షిణ కామరూపలోని రాణీలో ఏనుగులను పట్టుకొని శిక్షణనిచ్చే కేంద్రం ఒకటి ఉండేది, దానినే ఏనుగుల మహల్ అనేవారు. ఇటువంటి విషయాలన్నీ ఈ నవలలో ప్రస్తావించబడ్డాయి.

Also Read: హృదయాలను రంజింపజేసే మైమ్

ప్రాయశ్చిత్తం, మనువు చెప్పాడు, పాప కర్మలు, నిషేధాలు వంటి మాటలు పదే పదే ఈ నవలలో మనకు కనిపిస్తాయి. ప్రతి సంఘటనకు ప్రాయశ్చిత్తం అనేది ఒక ప్రత్యామ్నాయంగా చూపి బ్రాహ్మణ సమూహాలు అధిక మొత్తంలో ధనం , భూమి , ఆహారధాన్యాలను దక్షిణగా గోసాయిల నుండి పొందేవారు.

ఈ నవలలో మతం యొక్క వివిధ కోణాలను కళ్ళకట్టినట్టు దృశ్యీకరించ గలిగారు రచయిత్రి. మతం పేరిట దోపిడీ, అధికార దుర్వినియోగం, అణిచివేత, వివక్ష చాలా స్పష్టంగా కనబడుతుంది.

భూసంస్కరణల వలన గోసాయీల వద్ద ఉన్న భూములను ఎర్ర జెండా పట్టుకున్న కొన్ని సమూహాలు ప్రజలకు పంచి పెట్టేందుకు ప్రయత్నించినట్టు. వర్గ సంఘర్షణ అనేక రూపాలలో ఈ నవలలో చిత్రీకరించబడింది.

గోసాయినీల అంటే గోసాయిల భార్యల పేర్ల ప్రస్తావన ఈ నవలలో కనిపించదు. అంటే వారి అస్తిత్వానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. బాల్య వివాహాలు సర్వసాధారణం, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి తల్లిదండ్రుల ఇళ్లకు చేరిన వారు కోకోల్లలు. అందుకు ఉదాహరణ గిరిబాల, దుర్గ వంటి పాత్రలు. వీరిద్దరూ సనాతన కుటుంబాల్లో పితృస్వామ్య నిషేధాల మాటున హింసకు గురైన వారే. పెద్దగోసాయిని, చిన్నగోసాయినీతో సహా. అయితే ఏ హింసకు తాము బలయ్యారో అదే హింసను తమ బిడ్డలు కోడళ్ళపై వారు ప్రదర్శిస్తారు, కుటుంబ పరువు కోసం.

వుమెన్ ట్రాఫికింగ్ వ్యభిచార గృహాల నిర్వహణలో ప్రస్తుత సమాజంలో మహిళలు భాగస్వామ్యమైనట్టు , అయితే ఇప్పటి వీరిది చదువు ఇచ్చిన స్వార్థంతో కూడిన అజ్ఞానం.

నాటి గోసాయినీలది అజ్ఞానంతో కూడిన నిస్సహాయత.  కొందరు ధైర్యంగా అత్తగారి ఇళ్లలోనే ఉండి క్లిష్టమైన జీవితాలను గడుపుతుంటారు అందుకు చిన్న గోసాయిని పాత్ర ఉదాహరణ.

ఇంథ్రనాథ్ గోసాయి ఆకాలంలో కూడ స్త్రీల పట్ల సానుభూతి దయకలిగిన యువకుడు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఇంటికి చేరిన అతని చెల్లెలు గిరిబాలపై దయతో ప్రాచీన వ్రాతప్రతులను సేకరించేందుకు సహకరించాడు. మార్కుతో చనువుగా ఉండే గిరిబాలను తప్పు పట్టలేదు. తన తల్లి రోజంతా చుట్టకాలుస్తూ తనను తాను కొద్ది కొద్దిగా కాల్చుకోకుండా సంగీతం , నృత్యం వంటివి ఆస్వాదిస్తూ ఊరట పొందవచ్చు కదా అనుకుంటాడు.  ఈ నవలలో ఇంథ్రనాథ్ గోస్వామి ఒక 'సత్త్ర' కు వారసుడు. అభ్యుదయభావాలు గల చైతన్య వంతుడైన యువకుడు. స్త్రీలు ,వితంతువులు, పేదప్రజల పట్ల దయ, సానుభూతితో మెలిగేవాడు నల్లమందు నిషేధం కోసం ప్రయత్నిస్తాడు.

Also Read: నిర్మాణాత్మక విమర్శకు పర్యాయపదం "అంతరంగం"

ఇంథ్రనాథ్ గోసాయి ఒక నిరుపేద, తల్లిదండ్రులు లేని ఎలియన్ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ పేద ప్రజల పక్షాన నిలబడి చేయవలసిన సంస్కరణల కోసం. ప్రేమను ఆమెకు వ్యక్త పరచలేడు. ఆసంధర్బంలో ఇంధ్రనాథ్ గోసాయి చేత రచయిత్రి చెప్పిన మాటలు ప్రేమ పట్ల ఆమెకున్న ఆర్తిని ఔన్నత్యాన్ని తెలుపుతాయి.

"పచ్చటి తీరాల మధ్య పాకిపోయె నీలిసర్పం లాంటి జగాలియా నది తన ప్రియమైన ఎలిమన్ నిడుబారు వెండ్రుకల్ని జ్ఞాపకం తెస్తోంది. అవును ఈ వంతెన మీదనే ఆమెను కలిసి కొన్నది!

ప్రేమ దివ్యమైనది !
అది దేన్నీ కోరదు! కావాలని ఆరాట పడదు!
అన్ని దారులు అక్కడ కలిసి అంతమై పోతాయి అతనికి అలా అగుపిస్తోంది!
గిరిబాల మార్క్ చిన్నగోసాయినీ....
వాళ్ళ జీవితాలు కూడా ఈ దివ్య మార్గంలో సమున్మీలిత మయ్యాయా?" (280వ పేజీ)"

ప్రస్తుతం సమాజాన్ని వణికిస్తున్న కరోనా వంటి వ్యాధులు అప్పుడు కూడా ఉండేవని ప్రజలు విష జ్వరాలతో చనిపోయే వారని రచయిత్రి ఒక సంఘటన ద్వారా వివరించారు.

"దేవదత్త మాటలకు నిస్పృహగా నిలబడిన ఇంద్రనాథ్ గోసాయి ముందునుండి, మౌర్య కొడుకు చావుకు వచ్చినవాళ్లు, జగాలియా నదిలో శౌచస్నానం ముగించుకుని, నేల మీద సాష్టాంగ పడి, చిన్న గోసాయి ఈ మలేరియా, ఈ కాలజోర్ అంటురోగం అన్ని చోట్ల చెలరేగుతోంది. ఎంతమందో చచ్చిపోయారు. ఎందరికో తగిలింది. సర్కార్ కాంపౌండర్ ఇచ్చే ఎర్ర నీళ్లు వాళ్లను కాపాడలేక పోతున్నాయి. వాంతులు చేసుకొని చచ్చి పోతున్నారు. ఈగల్లా ఎగిరి పోతున్నారు" అంటూ వెళ్లిపోయాడు సమాధానం కోసం అయినా చూడకుండా.

ఆ మనుషులందరూ అస్థిపంజరాల గుట్టల్లా కనపడుతున్నారు. వాళ్ళందరూ నల్ల మందు గుప్పిట్లో చిక్కుపడ్డ వారే.( పేజి నెంబర్ 277)"

నాకైతే ఈ సంఘటన, ప్రస్తుతం కరోనా సమయంలో ప్రజల పరిస్థితి నల్లమందుకు బదులు మద్యం మట్టుబెట్టడం వంటిదిగా కనిపిస్తోంది. రచయిత్రి 1947 లో అస్సాంలోని కామరూప జిల్లాను గురించి రాసినప్పటికీ ఈ సంఘటన ప్రస్తుతం డెబ్బయి మూడు సంవత్సరాల తరువాత కూడా భారతదేశంలో అదే పరిస్థితి కొనసాగుతోంది అనిపించింది.

దేవదత్ అనే వ్యక్తి ఇంద్రనాథ్ గోసాయిని హెచ్చరించేందుకు వచ్చి‌, భూ సంస్కరణల వల్ల కోల్పోతున్న భూములను కాపాడుకోవాల్సినదని ఔదార్యంతో పేదలకు పంచ వద్దని హెచ్చరిస్తాడు. పైగా అమ్మ తలుచుకుంటే నాకే అమ్మమని డిమాండ్ కూడా చేస్తాడు.  పై మాటల ద్వారా భూ సంస్కరణలు గోసాయి కుటుంబాల్లో తెచ్చిన సమస్య అర్థమవుతుంది. భూములను పేదలకు పంచకుండా ప్రస్తుత రాజకీయ నాయకులు బినామీల పేరున ఆస్తులు ఉంచడం అనేది, ఆ కాలంలోనే జరిగాయని, వ్యవసాయ కార్మికులు, కమ్యూనిస్టుల పట్ల వారికి ఉన్నటువంటి చులకన, నీచమైన అభిప్రాయాలు దేవదత్ మాటల ద్వారా తెలుస్తోంది.

అంతేకాదు ఇంద్రనాథ్ చెల్లె గిరిబాల క్రిస్టియన్ మార్కును ప్రేమించడం మూలంగా ఆత్మాహుతికి గురికావడం వాటి గురించి ప్రస్తావిస్తాడు. కానీ అభ్యుదయ భావాలున్న ఇంధ్రనాథ్ అప్పటివరకు మౌనంగా ఉన్నప్పటికీ గిరి బాల ప్రస్తావనకు సమాధానం చెప్తాడు.ఇంద్రనాథ్ కు కులమతాల పట్టింపులు, వర్గ భేదాలు అహంకారము లేనటువంటి, ఒక మంచి మనిషిగా రచయిత్రి ఆ పాత్రను తీర్చిదిద్దింది.

ఆనాటి నవలలో చెప్పబడిన తంతులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దక్షిణలు గౌరవప్రదంగా పాపాలను తుడిచేందుకు సమర్పించ బడుతున్నాయి.

"బాముండి గోసాయికి మరో యజమాన్ బ్రాహ్మణుడికి జరుగుతున్న సంభాషణ. (134 పేజీలో)"

"ధర్మ శాస్త్రంలో మనవు సరిగ్గానే చెప్పాడంది..." "ఏమని"

" దేవతల శ్రాద్దాలయితే ఇద్దరు బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే చాలన్నాడు. తండ్రికో, తాతకో, ముత్తాతకో అయితే ముగ్గురు చాలన్నాడు. దేవతకూ, తండ్రికి లేదా తాతకు కలిపి చేస్తే ఒక్క బ్రాహ్మడే సరిపోతాడన్నాడు.... ఇప్పుడీ గందరగోళం చూడండి.... మహల్లో అంతా బ్రాహ్మణ గుంపులే. ఇంత మంది అవసరం ఏమొచ్చింది చెప్పండీ!..."
ఉన్నట్టుండి పాదుకల గదిలో నుండి అధికారి మహాప్రభు మాటలు వినపడ్డాయి-

"తండ్రయినా తాతయినా, మృతుల ఆత్మ  శ్రాద్ధానికి విచ్చేసిన బ్రాహ్మణుల శరీరాల్లో ఉద్దీప్తమవుతుందని ఆ మనువే కదా చెప్పాడు! వచ్చినవాళ్లు ఆ విషయం కూడా గుర్తుంచుకొని మాట్లాడితే హుందాగా గౌరవంగా ఉంటుంది" అంతా నిశ్శబ్దం.మనువు చెప్పాడంటూ పై సంభాషణల వంటివి నవలలో చాలా చోట్ల కనబడతాయి.

మార్కు "ఎంతోకొంత మనమందరం పాపులమే. భగవంతుని ఆలయంలో బలిపీఠం మీద పాత్ర పరిశుద్ధంగా ఉండేది కానీ దానితో ద్రాక్ష సారాయిని సేవించి, అపవిత్రం చేసాము. ఆ చిట్టా మనందరి తలమీద వేలాడుతూనే ఉంది. దాని మీద మన పాపాలు తీర్పులు శిక్షలు అన్ని రాయబడి ఉన్నాయి. ఇది ఇతరులకు కనపడదు. అంతే దాన్ని అదృశ్యంగా మోస్తూనే మనం తిరుగుతున్నాము. భగవంతుడి ఆదేశాలతో చూచినప్పుడు మనం ఎప్పుడూ తేలిపోతూనే ఉంటాము" ఇది క్రిస్టియన్ మతం లోని తీర్పు. పేజి నెంబర్ 134 వ పేజీలో మనువు చెప్పినా, 136 వ పేజీలో ప్రభువు చెప్పినా రెండు మతాల్లోనూ మూఢనమ్మకం దోపిడీకి సిద్ధపడ మని హెచ్చరించినట్టుగా ఉంటుంది.

దున్నే వాడిదే భూమి' అని నమ్మిన ఇంధ్రనాథ్ తమ ఆధీనంలో ఉన్న భూములన్నీ పొలాలుదున్నే ప్రజలవేనని ప్రకటించడానికి బయలుదేరుతాడు. పందొమ్మిది వందల ఎనబై ఒకటి!  పెద్ద సుడిగాలిలా భూపరిమితి చట్టం వచ్చింది చట్టానికి ఎన్నో సవరణలు వివిధ గోసాయిల పుత్ర రత్నాలు న్యాయస్థానాల మెట్లమీద ఎన్నో పగళ్ళు రాత్రులు గడపాల్సి వచ్చింది, భూమినంతా శాశ్వతంగా పోగొట్టుకొని పుస్తకాల అంగళ్ళు, కడకు కసాయి అంగళ్ళు పెట్టాలనుకున్నారు.

1980లో సత్రా కు విద్యుత్తు వచ్చింది కానీ కొన్ని ఇళ్లలో మాత్రమే వెలుగు నింపింది. మిగిలిన ఇళ్లలో ఇంకా ఆవ నూనె దీపాలు, కిరోసిన్ దీపాలు వెలుగుతున్నాయి ఇప్పుడు జగాలియా తీరంలో గోసాయి, బ్రాహ్మణ కుటుంబాల లోని ఆడపిల్లలు తక్కువ జాతి వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నారు. వాళ్ల అబ్బాయిలతో మూడు ముళ్ళు వేయించుకుంటున్నారు. చాలా సంసారాల్లో నల్ల మందు అలవాటు నుండి బయటపడ్డాయి. ఈ రోజుల్లో వ్యాపారులు నుండి వచ్చిన వర్తకులు అట్టహాసంగా సత్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నత పాఠశాల అభివృద్ధి పొందింది. ఇప్పుడు సత్రా దగ్గరగా మీర్జాలో కళాశాల కూడా వచ్చింది.

1981లో 30 ఏళ్ల తర్వాత మునుపు కర్ర వంతెన ఉన్నచోట ఇప్పుడు కొత్తగా వెలసిన కాంక్రీట్ వంతెన వద్ద చిన్న గోసాయిని చంపడానికి రెచ్చగొట్టిన కమ్యూనిస్టు నాయకుడు బలా ముఖాముఖి తారసపడ్డాడు. చాలా కాలం కిందట అతడు జైలు నుండి బయటకు వచ్చాడు.  పేదవాళ్ల కోసం బడుగు వర్గాల కోసం ఈ మనిషి పొందిన బాధ ఇంద్రనాథ్ గుండెల్లో ఉన్న బాధ కంటే తక్కువేమీ కాదు. పైపెచ్చు ఇతగాడు పెద్దగోసాయికి అక్రమ సంతానం. అతని తల్లిని బంగారు నగలు గుప్పించి పెద్దగోసాయి వదిలించుకున్నాడు.

ఇతడు బాల చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్ని ఒకరినొకరు పోల్చుకున్నారు. ఇద్దరికీ శరీరం తగ్గి చర్మం వదులుగా ఎలా అవుతుంది. ఇద్దరి జీవితం ఆఖరి మజిలీలో ఉన్నారు.  బలా చెయ్యి తో ఆపాడు అతను కూడా ఇష్టంగా ఆగాడు.

"రక్తపుటేరులు పారించి భూమిని సాధించావు. అయితే పేద రైతులకు దానిని సరిగానే పంచి పెట్టావా . 30 ఏళ్లు అయ్యాక ఇప్పటికీ వాళ్ళు సంతృప్తిగా బాగా ఉన్నారా" అన్నాడు బలా.
నాయకుడు నిశ్శబ్ధంగా ఉండి పోయాడు.

" సరిగ్గా ఈ వంతెన దగ్గరే మా ప్రియాతిప్రియమైన గోసాయి శరీరానికి దహన సంస్కారం చేసాము" క్షణకాలం ఉద్వేగానికి లోనై ఒక్క అడుగు నాయకుడి దగ్గరగా జరిగి అతని నుదిటి పై వెల్లడిస్తూ బలా స్థిరంగా అన్నాడు . "నువ్వే నువ్వు చంపావు. నువ్వే ఆయన గొంతు కోసింది"
నాయకుడు గర్జించాడు "రైతుల కడుపులు ఖాళీగా ఉన్నాయి. మీ గోసాయి అంబారీ ఎక్కి వచ్చాడు వరి కోతలకు. ఇలాంటి నాటకం ఇంకే గోసాయి వేయలేదు" .

బలా అన్నాడు "నువ్వు సరిగ్గా చూసావా అది చెదలు పట్టి ఉంది. ఆయన అంతరంగంలో ఎన్ని గాఢమైన ఆలోచనలు, ఆవేదనలు ఉండేవో నాకు ఒక్కడికే తెలుసు. ప్రాణం వదలడానికి ముందు నాతో ఏమన్నాడు తెలుసా  ? నేను చేద్దాం అనుకున్న పని ఫలించింది. ప్రయోజనం సిద్ధించింది. నా మాటలు నమ్ము. ఆయనకు అంబారీ మీద కూర్చోవాలని ఆశ ఏమాత్రమూ లేదు. ఆయన మనసులో ఎలాంటి తుఫాను చెలరేగుతున్నదో నాకు తెలుసు. నేను నా చేతులతో ఆ అంబారీని ఏనుగు కట్టడానికి తోడ్పడ్డాను. అది చెదలు పట్టిన హోదా బలా ఏడుస్తూ చెప్పిన సజీవ సాక్షం అది.

జీవితకాలం వివేకం లేని , పగ , ద్వేషం మాత్రమే తెలిసిన తొందరపాటు కలిగిన ఒక విప్లవ నాయకుని చేతిలో ప్రజలకు భూములు పంచా‌లనుకున్న ఇంధ్రనాథ్ హత్యకు గురవుతాడు. నవల ముగుస్తుంది.సామాజిక చారిిత్రక అంశాలపై అవగాహన కలిగించే గొప్ప నవల ఇది.
        
 - జ్వలిత

Follow Us:
Download App:
  • android
  • ios