Asianet News TeluguAsianet News Telugu

బూర రాజశేఖర్ తెలుగు కవిత: ఆ నలుగురే కదా...

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెనోళ్ల ప్రశంసలు అందుకుంటోంది. వారిపైనే బూర రాజశేఖర్ ఓ కవిత రాశారు.

Boora Rajasekhar poem on health workers in wake of Coronavirus pandemic
Author
Hyderabad, First Published May 13, 2020, 4:02 PM IST

ఓ ఉదయం
నువ్వలా దర్జాగా ఆఫీసుకెళుతూ
వీధి చివర మురికి కూపాన్ని శుద్ధిచేయ
పందులతో పోటిపడుతున్న అతన్ని చూసి
అసహ్యంతో ముఖం చిట్లించుకుని 
కంపరంతో చిర్రెత్తిపోయావు..

ఓ మధ్యాహ్నం
నువ్వలా సరదాగా షికారుకెళ్తు
నడిరోడ్డులో దీపపుస్తంభమై 
దారితప్పినవారిని గాడిలో పెట్టె అతన్ని చూసి
చిరాకుతొ చిల్లర రాబంధులంటూ
చీదరించుకుంటు వెళ్ళి పోయావు..

ఓ సాయంత్రం
నువ్వలా నీరసమైనప్పుడు
మనిషియంత్రాల మరమ్మత్తుల మాంత్రికుడైన
తెల్ల కోటులోని అతని చిరునవ్వును చూసి
జబ్బు పేరుతో డబ్బులాగే తాంత్రికుడంటూ
నిర్లక్ష్యంగా నిందలేసి పోయావు..

ఓ రాత్రివేళ
నువ్వలా నిర్లిప్తమై హాస్పిటల్లో
వందల రోగులకు తల్లై విసిగిపోయిన
ఆ ప్రాణధూతలోని అసహనాన్ని చూసి
చిన్నచూపుతో పని చేతగాని పొగరుబోతంటూ
బూతులదండకం వినిపించావు..

ఇప్పుడు
ఈ నిశ్శబ్దంలో

ఆ నలుగురే కదా..

పగలు - రేయి
కుటుంబాలకు దూరంగా
నీ కుటుంబం కోసం పనిచేస్తున్నారు.

ఆ నలుగురే కదా..

నీకు - నాకు,
దేహాలకు - దేశాలకు
నలుదిక్కుల రక్షణ కవచాలైనిలిచారు.

ఆ నలుగురే కదా..

ప్రపంచమే
గృహనిర్బంధమైనప్పుడు
ఆయువునిలిపె సైనికులై మనకోసం
అలుపెరుగని యుద్ధం చేస్తున్నారు.

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios