రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి... అది సాధ్యం కాదు: ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన స్టైల్ స్పీచ్ తో మంత్రి నవ్వులు పూయించారు.
సిరిసిల్ల జిల్లా: నూతన రాష్ట్రం తెలంగాణ లో ఇంకా సమస్యలు చాలా మిగిలివున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిష్కరించడం ఒకేసారి సాధ్యం కాదని... అందువల్లే విడతల వారీగా ఆ పని చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడపడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వశక్తి మహిళా గ్రూపులకు రూ. 10 కోట్ల చెక్కులు అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రాభివృద్ది మరీ ముఖ్యంగా తెలంగాణ అభివృద్దికి నాయకులు ఏం చేశాయో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కేవలం ప్రభుత్వాన్ని తిట్టడం కాదని ముందు మీరేం చేశారో చెప్పాలన్నారు. వారి గురించి ప్రజలకు తెలుసు కాబట్టే మాకు పాలించమని అవకాశం ఇచ్చారని అన్నారు.
read more గతంలో రాళ్లు, చెప్పులు.... ఈసారి మరేమిటోనని చంద్రబాబు భయపడే...: శ్రీదేవి
కేసీఆర్ సీఎం అయ్యాక ఊహించిన దానికంటే ఎక్కువ చేశామన్నారు. దేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కె దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆ దిశగా కనీసం ప్రయత్నాలయినా చేశారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళలు బయటకు రాలేదని... ఎన్టీఆర్ సీఎంగా అయ్యాకే బయటకు వచ్చారన్నారు. ఆతర్వాతే మహిళలకు సమాజంలో గౌరవం పెరిగేలా చేసింది తెలంగాణ ప్రభుత్వంమేనని అన్నారు. గతంలో 200 పెన్షన్స్ ఇచ్చినప్పుడు కోడల్లు అత్తలను చేరతీయలేదని... కానీ తాము 2వేల పెన్షన్స్ ఇవ్వడం మొదలతుపెట్టాక కోడళ్లు అత్తల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంటూ సభలో ఎర్రబెల్లి నవ్వులు పూయించారు.
ఒక్కో మహిళ గ్రూప్ కి 3 లక్షలు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారని.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి ఎన్నో చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. మహిళలకు గౌరవం వచ్చిదంటే కారణం సీఎం కేసీఆరేనని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగకుండా ఐకెపి మహిళ గ్రూప్ లకు అధికారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడన్నారు.
read more ప్రధాని మోదీని కలిసిన మాట నిజమే...కానీ...: గంటా శ్రీనివాస్
ఇక 30 రోజుల ప్రణాళిక లో మంచి గ్రామ పంచాయితీ గా చేసుకున్న జిపి లను గుర్తించి నిధులు ఇస్తామన్నారు. ఇందులోభాగంగా 339 కోట్లు గ్రామ పంచాయితీ లకు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వానికి డబ్బుల కొరత లేదని... అవసరమైనన్ని నిధులిచ్చి మంచి గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకు సహకరించిన మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వార గ్రామంలో అన్ని పనులు చేసుకోవాలని...ఆ అధికారం సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. పంచాయితీ డబ్బులు వాడకుండా ఉపాధి హామీ పథకం డబ్బులు వాడండని సూచించారు.
గతంలో చెన్నమనేని రాజేశ్వర్ ఈ నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేసారని... ఇప్పుడు రమేష్ బాబు ఆపని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.