చిత్రహింసలు పెట్టి...గ్యాంగ్ రేప్.. మహిళా జర్నలిస్టు దారుణహత్య
బల్గేరియాలో మహిళా జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవా ఆ దేశంలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
బల్గేరియాలో మహిళా జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవా ఆ దేశంలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో జరిగిన అవకతవకలను, అవినీతిని వెలికితీసిన విక్టోరియా గత కొన్నాళ్లుగా వరుస కథనాలు రాస్తోంది. ఇవి యూరోప్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ప్రస్తుతం ఆమె ‘‘డిటెక్టర్’’ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో రూస్ పట్టణంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మారినోవాను అడ్డగించిన దుండగులు ఆమెను పాశవికంగా హత్య చేశారు. తొలుత తమ పైశాచికత్వంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఆగంతకులు.. అనంతరం మారినోవాపై అత్యాచారం జరిపారు.
చనిపోయిన తర్వాత విక్టోరియా మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్కు సమీపంలో పడేశారు. అయితే జర్నలిస్ట్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఆమె మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషేంట్లు ఎవరైనా ఆమెపై దాడి చేసి చంపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పోస్ట్మార్టం నివేదికలో మాత్రం మారినోవా తలకు భారీ గాయాలయ్యాయని... ఊపిరి ఆడక ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. మరోవైపు విక్టోరియా మరణ వార్త క్షణాల్లో దేశం మొత్తం వ్యాపించడంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు.. నిరసన ప్రదర్శనలు చేస్తూ... హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ ఓ ప్రకటనలో బల్గేరియాను కోరాయి. గతేడాది కాలంలో యూరప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి.