త్వరలో భారత్ పర్యటన.. మోదీకి ట్రంప్ భార్య ధన్యవాదాలు
రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ కి అదిరిపోయే స్వాగతం పలుకుతాం అంటూ ఇటీవల మోదీ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మెలానియా ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను, తన భర్త ట్రంప్ ఈ పర్యటన పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నామంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు కూడా తెలియజేశారు.
‘ భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానానికి ధన్యవాదాలు. అహ్మదాబాద్, ఢిల్లీలో పర్యటించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్, నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అమెరికా-భారత్ సత్సంబంధాన్ని వేడుకలా జరుపుకుందాం’ అని ఆమె ట్వీట్ చేశారు.
రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ కి అదిరిపోయే స్వాగతం పలుకుతాం అంటూ ఇటీవల మోదీ ప్రకటించారు. ‘ ఈనెలాఖరుకి అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి మెలానియా భారత్ పర్యటనకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన అపూర్వ అతిథులకు భారత్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఆహ్వానాన్నిపలుకుతుంది. ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది’ అంటూ ఇటీవల మోదీ ట్వీట్ చేశారు. కాగా ట్రంప్ కి ఇది తొలి భారత్ పర్యటన కావడం విశేషం.