నాలుగేళ్ల బాలికపై రేప్, భార్యనే పట్టించింది: దోషికి జీవిత ఖైదు
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. హైదరాబాదులోని శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ ఘటన 2015లో జరిగింది. దోషి భార్య ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ కేసు ఛేదనలో ముఖ్య భూమిక పోషించింది.
హైదరాబాద్: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించింది. హైదరాబాదులోని శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో 2015లో ఆ నేరం జరిగింది. దోషికి జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి 45 రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
నిందితుడి భార్య భర్తపై అనుమానంతో సీసీటీవీ ఏర్పాటు చేసింది. ఆమె ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అత్యాచార బాధితురాలు తన కుటుంబంతో పాటు వాళ్ల ఇంట్లో అద్దెకు ఉంటూ వచ్చారు. చాకలెట్లు ఆశ చూపి నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. కేసును ఛేదించడంలో సీసీటీవీ ఫుటేజీ కీలక సాక్ష్యంగా పనికి వచ్చింది. కేసును పోలీసులు సూమోటాగా స్వీకరించి దర్యాప్తు చేశారు.