జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం: ముఠా గుట్టు రట్టు
హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసులు ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. నిర్వాహకుడితో పాటు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు విప్పారు. లాడ్జీ నిర్వాహకుడితో పాటు ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత కొంత కాలంగా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో గల రాఘవేంద్ర లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో మంగళవారం రాత్రి నిఘా వేసి దాడులు నిర్వహించారు. నాలుగు గదుల్లోని నలుగురు కస్టమర్లు పోలీసులకు చిక్కారు.
దనం సంపత్, ఒగ్గు ఓబిలాష్, మేరుగు సురేష్, నర్రా రాజ్ కుమార్ లతో పాటు నిర్వాహకుడు సత్యనారాయణ అలియాస్ రాజేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నలుగురు మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు. కస్టమర్ రాజ్ కుమార్ వీఆర్వోగా పని చేస్తున్నాడు. వారందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరోనా కారణంగా లాడ్జీకి గిరాకి పడిపోయింది. దీంతో డబ్బుల కోసం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సత్యనారాయణ అలియాస్ రాజేష్ చెప్పాడు.