డ్రగ్స్ కథ కంచికేనా..?
- తెలుగు రాష్టాలలో సంచలనం సృష్టించిన సంఘటన డ్రగ్స్
- సిట్ మొదటి దశ విచారణ ముగియనుంది
- మరో నయూమ్ కథగా మారనుందా?
మాదక ద్రవ్యాల కేసులో సిట్ చేపడుతున్న విచారణ కంచికి చేరినట్టేనా..? అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్టాలలో సంచలనం సృష్టించిన సంఘటన
మాదక ద్రవ్యాల కేసు. దీనిలో సినీ ప్రముఖుల హస్తం కూడా ఉందని తెలియడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఎవరి నోట విన్నా ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఈ కేసు గురించి మొదట చర్చ రాగానే.. సిట్ దర్యాప్తు ప్రారంభించగానే.. ఈ కేసుకు సంబంధం ఉన్నవాళ్లు ఎవరినీ వదిలి పెట్టమని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మాటమర్చారు. డ్రగ్స్ తీసుకున్నవారంతా నేరస్థులు కాదని.. వారంతా బాధితులు అవుతారని ఆయన పేర్కొన్నారు. దీంతో.. ఇక ఈ కేసు కంచికి చేరినట్టే నని అందరూ భావిస్తున్నారు.
పూరిజగన్నాథ్ తో మొదలైన సిట్ విచారణ.. నేడు నందూతో ముగియనుంది. ఈ రోజుతో సిట్ మొదటి దశ విచారణ ముగుస్తుంది. ప్రస్తుతం విచారించింది కొంత మందినేనని.. తమ జాబితాలో రాజకీయనాయకులు, మరికొందరు సినీ ప్రముఖులు.. వారి వారసులు, బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని అకున్ సబర్వాల్ ప్రకటించారు. కాగా.. ఈ విచారణ ఇంతటితో నిలిపివేయాలని తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. కొద్ది రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మాటామార్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఇదే నిజమైతే.. ఎంతో ఆర్భాటంగా మొదలైన సిట్ విచారణ ... మళ్లీ వార్తల్లోకి కూడా రాకుండా పోతుంది. విచారణ ఇదే స్థాయిలో కొనసాగుతుందో.. లేక మరో నయూమ్ కేసులా మిగిలిపోతుందో.. ఏమి జరగబోతుందో వేచి చూడాలి..