Asianet News TeluguAsianet News Telugu

ఆ సంఘటనే చంద్రబాబును అడ్డుకోడానికి కారణం...: కళా వెంకట్రావు

టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనలపై ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు  సీరియస్ గా స్పందించారు.  

kala venkatrao fires on YSRCP Govt over vizag incidents
Author
Amaravathi, First Published Feb 27, 2020, 7:18 PM IST

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు. అసైన్డ్‌ భూములు కోల్పోయిన బలహీన వర్గాలకు చెందిన రైతులకు అండగా ఉండేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోవడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. ప్రోగ్రామ్‌ పెట్టుకుంది టీడీపీ అయితే వైసీపీ వాళ్ళు రావడం ఏంటి..? పోలీసు రక్షణ కల్పించాల్సింది ఎవరికి..? టీడీపీ యాత్రకు పోలీసు రక్షణ ఇస్తారా..? యాత్ర అడ్డుకునే వైసీపీ వాళ్లకు రక్షణ కల్పిస్తారా..? మంత్రులే అడ్డుకోమని పిలుపు ఇస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పర్యటిస్తామంటే దాన్ని అడ్డుకోమనే వాళ్లు మంత్రులుగా అనర్హులని పేర్కొన్నారు. చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడం టీడీపీపై  వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపుకు పరాకాష్ట అని అన్నారు. వైసీపీ కార్యకర్తను ఎయిర్‌పోర్టులోకి ఎలా అనుమతించారు? అని ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీశారు. 

అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు... ఎటు తీసుకుపోతున్నారు... అని నిలదీశారు. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయని... ఇలా చేస్తే విశాఖకు పెట్టుబడులు ఎలా వస్తాయి..? మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వాళ్లపై చర్యలు తీసుకోరా..? ప్రభుత్వమే శాంతిభద్రతను ఉ్లంఘిస్తుందా? పోలీసులే అరాచక శక్తులకు రక్షణ కల్పిస్తారా..? అని ప్రశ్నించారు. 

read more  చంద్రబాబుపై చెప్పులు వేయమని చెప్పిందే ఆయన...: మాజీ మంత్రి జవహర్

పేదలకు అండగా వచ్చారనే చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో జగన్ ను విశాఖ ఎయిర్‌పోర్టులో ఆపేశారని ఇప్పుడు కక్ష తీర్చుకుంటారా..?  ఆరోజు (2017 జనవరి 26) జరిగింది వేరు ఈరోజు (27.02.2020) జరిగింది వేరు అని అన్నారు. ఆరోజు రిపబ్లిక్‌ డే, మరుసటి రోజు విశాఖలో సమ్మిట్‌ (2017 జనవరి 27,28) ఉంది కాబట్టే జగన్ అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. 

జల్లికట్టు స్ఫూర్తిగా విశాఖ బీచ్‌లో క్యాండిల్‌ ర్యాలీకి జగన్‌ పిలుపు ఇచ్చారని... అయితే జల్లికట్టు ఉద్యమంలో జరిగిన సంఘటను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఆయనను ఆపేశారని తెలిపారు. ఈరోజు (27.02.2020) చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అనుమతి అడిగామని.... 50 మందిని మాత్రమే స్వాగతానికి అనుమతి ఇస్తామని....అనేక ఆంక్షలతో పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. మరి వందలాది వైసీపీ కార్యకర్తలను ఎయిర్‌పోర్టులోకి ఎలా వదిలారు? అని నిలదీశారు. 

పోలీసులు అనుమతి ఇచ్చిన తరువాతే చంద్రబాబు విశాఖ వచ్చారని అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ భూములు కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు చంద్రబాబు విశాఖ పర్యటన పెట్టుకున్నారని తెలిపారు. గతంలో జగన్ ను ఆపింది పోలీసులే కానీ ఈరోజు పోలీసు అనుమతి ఇచ్చినా చంద్రబాబును ఆపింది వైసీపీ కార్యకర్తలేనని అన్నారు. 

read more  అచ్చెన్నాయుడికి తాకిన విశాఖ నిరసనల సెగ... ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత

ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో మంత్రులు మకాం వేసి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎయిర్‌పోర్టుకు పంపించారని ఆరోపించారు. కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలు విసిరేవాళ్లను అదుపులోకి తీసుకోరా? కార్లకు అడ్డంగా పడుకున్న వైసీపీ వాళ్లను కనీసం అడ్డు తొలగించరా? టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ నాయకుడు కారు ధ్వంసం చేస్తారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులపై దాడులు చేసి గాయపరుస్తారా? వైసీపీ వాళ్లను వదిలేసి టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్‌, ఇతర నాయకును అరెస్టు చేస్తారా? విల్లా రామ్మోహన్‌పై దాడిచేసి గాయపరుస్తారా? మెడలో గొలుసు లాక్కుంటారా? పసుపు చొక్కా వేసుకున్న వాళ్లందరినీ ఆపేస్తారా? వైసీపీ వాళ్లను, కోడిగుడ్లు వేసే వాళ్లను మాత్రం వదిలేస్తారా? పోలీసు వైసీపీ వాళ్ల కోసమే పనిచేస్తారా? పేద కోసం పనిచేసే వాళ్లకు రక్షణ ఇవ్వరా? అంటూ పోలీసులను, ప్రభుత్వాన్ని కళా వెంకట్రావు ప్రశ్నించారు.     

Follow Us:
Download App:
  • android
  • ios