Asianet News TeluguAsianet News Telugu

2020లో ఏపి ప్రభుత్వం ఏం చేయనుందంటే: సీఎం జగన్

2020 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమేం చేయనుందో ముఖ్యమంత్రి జగన్ అధికారులకు వెల్లడించారు. వాటిని సరిగ్గా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

AP CM YS Jagan review meeting on spandana programme
Author
Amaravathi, First Published Dec 31, 2019, 5:37 PM IST

అమరావతి: సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్పందన కార్యక్రమంలో  భాగస్వామ్యమైన అందరూ చాలాబాగా పనిచేస్తున్నారని సీఎం అభినందించారు.. 

స్పందనలో వస్తున్న విజ్ఞాపన పత్రాలు పరిష్కారంలో నాణ్యత కోసం ఇప్పటికే విధి విధానాలను ఏర్పాటు చేసుకున్నామని  తెలిపారు. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధి దారుల ఎంపిక, సోషల్‌ ఆడిట్, అర్హుల జాబితాలో ఒక వేళ పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలన్నదానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ తయారుచేసినట్లు తెలిపారు. ఈ ప్రొసీజర్‌ అన్ని గ్రామ సచివాలయాలకు, విభాగాలకు పంపిస్తామన్నారు. 

 2020 లో ఏపి ప్రభుత్వం చేపట్టే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే 

వైయస్సార్‌ నవశకం:

వైయస్సార్‌ నవశకం కింద ఇళ్లపట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి దాదాపు 60 శాతం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్తరేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేస్తాం. మనకు ఓటు వేయనివారుకూడా అర్హులైతే పథకాన్ని వర్తింపు చేయాలి. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ఆడిట్‌ కోసం డిస్‌ప్లే చేస్తున్నాం. 

అధికారులురైతు భరోసా, అమ్మ ఒడి, ఇళ్లపట్టాలు, రేషన్‌ కార్డులు, పెన్షన్లు సహా పథకాలకు సంబంధించి అర్హతలను, జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలి. 

AP CM YS Jagan review meeting on spandana programme

ఆర్టీసీ విలీనం:

జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదే. ప్రజా ప్రతినిధులు డిపోల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి. దాదాపు 50వేలకు పైగా ఉన్న కార్మికు కుటుంబాల దీర్ఘకాలిక కలను నెరవేర్చాం. 


ఆరోగ్యశ్రీ, సబ్‌ సెంటర్లు, తీవ్రవ్యాధి గ్రస్తులకు పెన్షన్లు:

జనవరి 3న కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం. ఆ రోజు 1.5 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నాం. పిబ్రవరి చివరి నాటికి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తాం.. పశ్చిమ గోదావరిలో విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలు జనవరి 3న పైలట్‌ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఈ జిల్లాలో 2059 రోగాలకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తాం. మిగతా జిల్లాల్లో 1259 రోగాలకు ఆరోగ్య శ్రీ సేవలు పెంపు వుంటుంది. ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాకుపెంచుతూ 2059 రోగాలకు వర్తింపజేస్తాం. 

పిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తాం. తాలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్‌
 అందిస్తాం. మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్నవారికి నెలకు రూ.5వేల చొప్పున, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ. 3వేలు, 
తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్నవారికి రూ.5వేల చొప్పున పెన్షన్‌ అందిస్తాం.. 

జనవరి చివరినాటికి 5వేల సబ్‌సెంటర్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కంప్లీట్ చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా సబ్‌సెంటర్లను ఏర్పాటు చేస్తాం. గ్రామాల మధ్యలో సబ్‌సెంటర్లు ఉంటే ఆరోగ్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. జనవరి 6 కల్లా స్థలాల గుర్తింపు పూర్తికావాలని అధికారులను ఆదేశించాం. 

AP CM YS Jagan review meeting on spandana programme


 రైతు భరోసా:

జనవరి 2న రైతు భరోసాకు సంబంధించి చివరి విడత డబ్బు పంపిణీ చేస్తాం. 46,50,629 రైతు కుటుంబాలకు ఈ డబ్బు పంపిణీ చేస్తున్నాం. గ్రామ వాలంటీర్లు జనవరి 3న లబ్దిదారుల ఇంటికి వెళ్లి లేఖలు ఇవ్వాలి, రశీదు కూడా తీసుకోవాలి. రైతు భరోసాకు సంబంధించి లబ్ధిదారుల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. వచ్చే ఖరీఫ్‌ నాటికి మళ్లీ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తాం.  దీనిపై కూడా అధికారులు దృష్టిపెట్టాలి. 

అమ్మ ఒడి:

జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. సోషల్‌ ఆడిట్‌ తర్వాత జనవరి 2న తుది జాబితా విడుదల చేస్తాం. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ 81,72,224 మంది పిల్లల డేటా పరిశీలన చేశాం. 46,78,361 మంది తల్లుల్లో అర్హులైన తల్లుల సంఖ్య 42,80,823. రీవెరిఫికేషన్‌లో మరో 3,97,538  మంది తల్లులు. జనవరి 1 నాటికల్లా రీ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది. ఆ త్వరగా అర్హుల సంఖ్యను గుర్తించాలి.

జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులకు అడిగి తెలుసుకున్నాం. అమ్మ ఒడి కార్యక్రమం సందర్భంగా జనవరి 4 నుంచి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలి. విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలమీద అవగాహన కల్పించాలి.  

AP CM YS Jagan review meeting on spandana programme

జనవరి 4,6,7,8 తేదీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలి

1.అమ్మ ఒడి

2.సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు– నాణ్యతతో కూడిన ఆహారం, దీనికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చు. 

3. స్కూళ్లలో ఇంగ్లిషు మాధ్యమాన్ని అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలు, దీనికోసం పిల్లలకోసం నిర్వహిస్తున్న బ్రిడ్జి కోర్సులు, ఇంగ్లిషు మాధ్యంపైన, దీన్ని ఏరకంగా స్కూళ్లలో తీసుకు వస్తున్నాం, చేపట్టబోయే బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు ఇస్తున్న శిక్షణ

4. పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు నాడు–నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలు ఈ నాలుగు అంశాలపైన ఈనాలుగు రోజుల్లో తల్లిదండ్రులకు, విద్యా కమిటీలకు, పిల్లలకు అవగాహన కల్పించాలని ఆదేశం.జనవరి 9వ తేదీన అమ్మ ఒడి కార్యక్రమాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి నిర్వహించాలి. స్థానిక ప్రజా ప్రతినిధులందర్నీకూడా భాగస్వామ్యం చేయాలి

అమ్మ ఒడి లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయలేదు. మనం చేస్తున్న కార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. స్కూళ్ల నిర్వహణలో వారి పాత్ర కీలంగా ఉండాలి.  


రైతులు ఆత్మహత్యలు:

2014 నుంచి 2019 జూన్‌ వరకూ ఆత్మహత్య చేసుకున్న వారిలో 556 మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు. గతంలో వీరి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టింది:. వీరందరికీ ఫిబ్రవరి 12న వారికి పంపిణీ చేయాలి. 2019 జూన్‌ నుంచి ఈ డిసెంబర్‌ వరకూ కూడా ఎవరైనా రైతులు బలవన్మరణానికి పాల్పడితే కలెక్టర్ల్, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని మార్గదర్శకాలు మనం రూపొందించాం. అయినా సరే వారికి పరిహారం అందని పరిస్థితి కనిపిస్తోంది.

కోటి రూపాయలు ప్రతి కలెక్టర్‌ వద్ద పెట్టినప్పటికీ తాత్సారం వల్ల ఇంకా చాలా మందికి డబ్బులు అందని పరిస్థితి ఉంది. 121 మంది ఆత్మహత్యచేసుకుంటే అందులో చాలామందికి డబ్బులు అందలేదు. ఈ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. వీటిని అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలి. ఈ డబ్బుమీద అప్పులువాళ్లు, బ్యాంకులూ ఎలాంటి క్లెయిం చేయకూడదు. 

ప్రతి కలెక్టర్‌ వారి ఇళ్లకు పోయి.. పరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. కలెక్టర్లు వద్ద డబ్బు అయిపోతే వెంటనే అడగాలి. ఏదైనా రైతు కుటుంబానికి జరగరానిది జరిగితే.. వారంరోజుల్లోగా కలెక్టర్లు స్పందించాలి. ఈ విషయంలో మానవీయతతో ఉండాలని పదేపదే చెప్తున్నాను. 


రైతు భరోసా కేంద్రాలు:

ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా 11,150 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏప్రిల్‌ నాటికి మొత్తం కేంద్రాలు సిద్ధమవుతాయి. వీటికోసం ఎక్కడెక్కడ భనాలు, స్థలాలు కావాలో వెంటనే గుర్తించాలి. ఫిబ్రవరి 1న 3,300 రైతు భరోసా కేంద్రాలు తొలిదశలో ప్రారంభం. వీటివల్ల వ్యవసాయరంగంలో సమూల మార్పులు. 
నాణ్యతో కూడి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఈ కేంద్రాల్లో గ్యారెంటీతో లభిస్తాయి. అలాగే డిజిటల్‌ కియోస్క్‌ కూడా రైతు భరోసా కేంద్రంలో ఉంటుంది.

భూసార పరీక్షలు కూడా చేస్తారు. రైతుల ఉత్పత్తులకు కొనుగోలు కూడా ఈ భరోసా కేంద్రాల ద్వారానే భవిష్యత్తులో జరుగుతుంది. అలాగే విత్తన పంపిణీ కూడా భవిష్యత్తులో జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంపైనకూడా రైతులకు అవగాహన, శిక్షణ లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ఈకేంద్రాలు బలోపేతం చేస్తాయి.ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో రైతు భరోసా కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి
.
పేదలందరికీ ఇళ్లు:

నాకే కాదు కలెక్టర్లందరికీ ఫేవరెట్‌ కార్యక్రమం పేదలందరికీ ఇళ్లపట్టాలు పంపిణీ  చేశారు. ఇప్పటివరకూ 22,76,420 మంది లబ్ధి దారుల గుర్తింపు. అన్ని గ్రామ,  వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించామన్న అధికారులు. ఇంకా 15వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. కలెక్టర్లు మరింత ఉద్ధృతంగా పనిచేయాల్సి ఉంటుంది. 
ఉన్న సమయం కేవలం రెండు నెలలు , ఈలోగా మొత్తం భూముల గుర్తింపు, సేకరణ పూర్తి కావాలి.

ప్రతిజిల్లాలో కనీసం మూడు సార్లు పర్యటించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు. జిల్లా అధికారులతో సమావేశమై... ఇళ్లపట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలి. నిద్రలేచిన దగ్గర నుంచి ఇళ్లపట్టాల అంశంపైనే ఆలోచనలు చేయాలి. దేవాలయాలు, ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు సంబంధించిన స్థలాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలుకాకుండా మరే ఇతర భూములునైనా ఇళ్లపట్టాలకు పరిశీలన చేయాలి.ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం. 

ఇసుక పంపిణీ

ఇసుకను డోర్‌డెలివరీ చేయాలి. కొంతమంది రవాణాదారులు అడ్వాంటేజ్‌ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ ఇబ్బంది వినియోగదారుడికి లేకుండా చేయడానికే ఈప్రయత్నాలు. మధ్యవర్తులు ప్రమేయం ఎక్కడా కూడదు. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి వచ్చేలా ఏర్పాటు.  

కృష్ణా జిల్లాలో 2వ తారీఖున  పిబ్రవరి 10న విశాఖ, ప.గో, కడప జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా డోర్‌ డెలివరీ ప్రారంభం. జనవరి 20 నాటికి అన్నిజిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు. జనవరి 20 నాటికి 389 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఉంటాయి. 100 మొబైల్‌ పార్టీలు. 

జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ 50,348 టన్నుల అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక స్వాధీనం. 4,644 వాహనాలు సీజ్‌. డిసెంబరులో 2159 టన్నుల ఇసుక స్వాధీనం. 355 వాహనాలు సీజ్‌.. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జూన్‌ నుంచి 2976 కేసులు నమోదు.డిసెంబరులో 248 కేసులు నమోదు.  


దిశచట్టం అమలుపై సన్నద్ధత:

దిశచట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలి. మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడ్డం, లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలను తీవ్రంగా తీసుకోవాలి.ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి మన చేసిన చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపాం. ఈలోగా మనం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలి.

జిల్లా ఎస్పీలు ఓనర్‌షిప్‌ తీసుకుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయి.  చర్యల విషయంలో అంకిత భావాన్ని ప్రదర్శించాలి. దిశ చట్టం అమలుకు తీసుకుంటన్న చర్యలను కలెక్టర్లు, ఎస్పీలకు వివరించిన డీజీపీ. 

ప్రతిజిల్లాలో మహిళా పోలీస్‌స్టేషన్‌ను బలోపేతంచేస్తున్నాం.  మహిళా పోలీస్‌ స్టేషన్లపై ప్రచారం చేయాలి. ఈ మహిళా పోలీస్‌స్టేషన్లో సిబ్బందిని బలోపేతం చేయాలి. 
ముగ్గురు ఎస్సైలు, అదనపు ఎస్సైలను ఇక్కడ పెడుతున్నాం. 

బోధనాసుపత్రిలో ఉన్న ఒన్‌ స్టాప్‌ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..దీనికీ పబ్లిసిటీ ఇవ్వాలి. ఒన్‌స్టాప్‌ సెంటర్లలో కూడా ఒక ఎస్సైను ఉంచుతున్నాం. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలి. దిశ చట్టం అమలు కోసం ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా పెడుతున్నాం. అలాగే మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్‌ అధికారి ఉంటారు.

అలాగే జిల్లాకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా పెడుతున్నాం. అలాగే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లను నిర్మిస్తున్నాం. 
అలాగే ప్రత్యేక కోర్టులకోసం ఒక్కో కోర్టుకు రూ.2 కోట్లు చొప్పున రూ.26 కోట్లు ఇస్తున్నాం. డబ్బును డిపాజిట్‌ కూడా చేస్తున్నాం. ఈ పక్రియలు అన్నింటిపైనా కూడా ప్రచారం చేయాలి.

తప్పులు చేస్తే వెంటనే వారిని చట్టంముందు నిలబెట్టి బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలి. దిశ కాల్‌ సెంటర్, యాప్‌కూడా ఏర్పాటు చేయాలి. నెలరోజుల్లోగా వీటన్నింటినీ సిద్ధంచేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఏయే సమస్యలను ఎన్నిరోజుల్లోగా పరిష్కారం చేస్తామన్నదానిపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. 
ఇకపై ప్రతి రోజూ కూడా స్పందన గ్రామ,  వార్డు సచివాలయాల్లో కొనసాగుతుంది. చరిత్రాత్మక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. 2020 చరిత్రాత్మక సంవత్సరంగా నిలిచిపోవాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios