ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత
:నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను అన్నీ తానై గెలిపించిన కల్వకుంట్ల కవిత.... ఎంపీగా మాత్రం ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 1,62,397 ఓట్లు తక్కువగా వచ్చాయి.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధులే విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జగిత్యాల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డిని కవిత దగ్గరుండి ఓడించారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించారు.
నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నామ మాత్రంగానే ఓట్లు వచ్చాయి. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే 41,079 ఓట్లు దక్కాయి. ఆ తర్వాత ఆర్మూర్ స్థానంలో 39,599 ఓట్లు బీజేపీకి వచ్చాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కేవలం 1,46,904 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ కు 5,69,654 ఓట్లు వస్తే కాంగ్రెస్ 3,39,653 ఓట్లు దక్కాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మూడో స్థానానికి బీజేపీ పరిమితమైంది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిలో తేడా వచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరించకపోవడంతో 178 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. రైతులకు సుమారు 91 వేల ఓట్లు వచ్చాయి. తనను గెలిపిస్తే ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి అరవింద్ హామీ ఇచ్చారు.
2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 4,06,717 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 477,160 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 68,371 ఓట్లతోనే సరిపెట్టుకొంది. కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ డిపాజిట్ కోల్పోయారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 3,30,256 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. టీఆర్ఎస్కు మాత్రం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 1,62,397 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 2,71,282 ఓట్లు తక్కువగా వచ్చాయి.
పసుపు బోర్డు సమస్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపింది. ఈ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ అగ్రనేతలు ఇదే విషయమై హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని తప్పుబట్టారు. ఐదేళ్ల పాటు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని టీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎదురు దాడికి దిగారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
178 మంది రైతులకు సుమారు 91 వేల ఓట్లు వచ్చాయి. రైతులు ఓట్ల చీల్చకపోయి ఉంటే కవిత విజయం సాధించేది. రైతులు నామినేషన్లు ఉప సంహరించుకొనేలా టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు కూడ ఫలించలేదు.
తాను ఓటమి పాలైనా కూడ నిజామాబాద్ను వదలబోనని కవిత సోమవారం నాడు ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని కూడ కవిత గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కవిత పరామర్శించారు.