మగాడివైతే రారా.. సన్నీకి ప్రియా సవాల్.. బిగ్బాస్ వార్నింగ్.. ఇదేం షోరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్
బిగ్బాస్ 5 సీజన్ షో కాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. వినోదం కాస్త పక్కదారి పడుతోంది. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ ల కోసం ఇంటి సభ్యులు వ్యక్తిగతంగా తిట్టుకోవడం, చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పదో రోజు హౌజ్లో ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి.
బిగ్బాస్5 పదో రోజు నిన్నటి టాస్క్ ని కంటిన్యూ చేశారు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ లో రెండు టీములు హోరా హోరిగా పోరాడాయి. ఈ క్రమంలో లోబోకి గాయాలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన గేమ్ కి దూరంగా ఉన్నారు. అయితే రెండు టీమ్లు(వోల్ఫ్, ఈగల్) నువ్వా నేనా అనే స్థాయిలో ఆటని కొనసాగించారు.
అయితే ఈ క్రమంలో షో పక్కదారి పట్టినట్టయింది. తాము సాధించాల్సిన వాటి కోసం ఇతర టీమ్ సభ్యులపై ఫిజికల్గానూ దాడులకు దిగే పరిస్థితి నెలకొంది. అనీ మాస్టర్, ఉమాదేవి బూతులు తిట్టుకునే స్థాయికి వెళ్లారు. అంతేకాదు ఉమాదేవి ఏకంగా కొట్టేందుకు ప్రయత్నించింది. సన్నీ సైతం తన చేతితో నెట్టేయడంతో ప్రియాంక కింద పడిపోయింది. ఈ క్రమంలో రెండు టీమ్ల సభ్యులకు గాయాలయ్యాయి.
అయితే గేమ్లో భాగంగా ప్రియా రెచ్చిపోయారు. మాగాడివైతే రారా ఆడదామంటూ కామెంట్ చేయడం హౌజ్ని హీటెక్కించింది. దీనికి సన్నీ కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అయితే ఇతర సభ్యులు ఓదార్చడంతో మ్యాటర్ సర్దుమనిగింది. అంతకు ముందు నా మీదకు వస్తే కాలుతో తంతా అని ప్రియా అనడం కూడా వివాదంగా మారింది.
గేమ్ కాస్త గొడవలకు దారితీస్తున్న నేపథ్యంలో బిగ్బాస్ స్పందించారు. ఇంటిసభ్యులకు హెచ్చరికలు చేశారు. హౌజ్లో హింసకి తావు లేదని తెలిపారు. బిగ్బాస్ హెచ్చరించిన తర్వాత కూడా ఇంటి సభ్యులు అదే మాదిరిగా రెచ్చిపోవడంతో ఇక టాస్క్ ని ముగిస్తున్నట్టు తెలిపారు బిగ్బాస్. హౌజ్లోని పరిణామాల నేపథ్యంలో ఈ టాస్క్ ని ముగిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ గేమ్లో వోల్ఫ్ టీమ్ విజయం సాధించింది.
మరోవైపు మధ్యలో బిగ్బాస్ ఇచ్చిన `ఆగట్టునుంటావా.. ఈ గట్టునుంటావా` టాస్క్ లో ఈగల్ టీమ్ విజయం సాధించింది. అయితే ఇందులో ఉమాదేవి ఫ్లాట్ఫామ్ని నెట్టే సందర్భంగా ఆయాస పడటం అందరికి నవ్వులు పంచింది. దీంతోపాటు `సాగరా సోదరా` టాస్క్ లో ఫలితం సరైన విధంగా సంచాలకులు నిర్ణయించలేకపోవడంతో బిగ్బాస్ దాన్ని రద్దు చేశారు.
మొత్తంగా బిగ్బాస్ హౌజ్లో వినోదం పక్కకు వెళ్లి ఇంటి సభ్యుల మధ్య గొడవలకు నెలవైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు రియల్గా ఉండటం లేదని, తాము హైలైట్ కావాలని చిల్లరగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి.