ఈ చికిత్స అద్భుతం, విదేశాల్లో అయితే నోబెల్ ప్రైజ్ వచ్చేది: మహేష్ బాబు
తన బిజీ షెడ్యూల్ లో కూడా మహేష్ చక్రసిధ్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించేందుకు సతీ సమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్ నగర శివారులో శంకర్ పల్లి సమీపంలో చక్రసిధ్ వైద్య కేంద్ర ఏర్పాటైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. తన బిజీ షెడ్యూల్ లో కూడా మహేష్ చక్రసిధ్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించేందుకు సతీ సమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్ నగర శివారులో శంకర్ పల్లి సమీపంలో చక్రసిధ్ వైద్య కేంద్ర ఏర్పాటైంది.
సిద్ధ అనేది ప్రాచీన వైద్యం. నయం కానీ నొప్పులు, వ్యాధుల నుంచి సిద్ధ వైద్యం ద్వారా ఉపశమనం కలిగిస్తారు. దీని ప్రారంభోత్సవానికి మహేష్ బాబు, నమ్రత దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు సిరివెన్నెల సీతారామశాస్రి, రాజీవ్ కనకాల, యాంకర్ సుమ హాజరయ్యారు.
డాక్టర్ సత్య సింధూజ మాట్లాడుతూ సిద్ధ వైద్యం 4000 సంవత్సరాల పురాతనమైనది అని, మానవ ఉనికి యొక్క భౌతిక, ఆధ్యాత్మిక మరియు మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుంది అని ఆమె అన్నారు. మహేష్ మాట్లాడుతూ.. చక్ర సిధ్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇది అరుదైన, అద్భుతమైన చికిత్స విధానం. ఇది కేవలం జబ్బుని నయం చేసే విధానం మాత్రమే కాదు.. మన జీవన శైలిని మార్చే పద్దతి కూడా.
ప్రపంచం మొత్తంలో సిద్ద వైద్యంలో నిపుణురాలిగా ఉన్నది డాక్టర్ సత్య సింధూజ మాత్రమే. డాక్టర్ సత్య సింధూజ సూచనలు పాటిస్తే మనం అనేక వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు.. అద్భుతాలు చూడవచ్చు. ఇలాంటి ప్రాచీనమైన, సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇదే రకమైన చికిత్సని విదేశాల్లో అందిస్తే.. వారు ఆ చికిత్సకు అత్యంత ప్రాధాన్యత కల్పించేవారు. నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చేవారు. కాబట్టి ఇలాంటి చికిత్సకు ప్రచారం కల్పించడం నా భాద్యతగా భావిస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు.
నమ్రత మాట్లాడుతూ.. గతంలో మహేష్ మైగ్రేన్ తో బాధపడుతున్నప్పుడు ఈ రకమైన వైద్యంతో ఉపశమనం పొందాడు. ఇలాంటి వైద్యం గురించి అందరికి తెలియాలని తాను కోరుకుంటున్నాడు అని నమ్రత అన్నారు.
ఇదిలా ఉండగా మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. పోకిరి, దూకుడు చిత్రాల తర్వాత ఆ స్థాయిలో మాస్ ఎలిమెంట్స్ తో మహేష్ క్యారెక్టరైజేషన్ ఉంది.
ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.