మాజీ మిస్ శోభితా క్రియేటివ్ స్టూడియోస్!
`గూఢచారి` చిత్రంతో ఆడియెన్స్ మంత్రముగ్ధుల్ని చేసిన మాజీ ఫెమినా మిస్ ఇండియా 2013లో సెకండ్ రన్నర్ శోభితా దూళిపాళ్ళ తాజాగా కొత్త ఆలోచనలో ముందుకొచ్చింది. క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో కొత్త ఆలోచనలకు రూపం పోయనుంది.
మోడల్గా తన కెరీర్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్, తెనాలికి చెందిన శోభితా దూళిపాళ్ళ తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్రాలతో దూసుకుపోతుంది. పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. సెక్సీ అందాలతోనూ మంత్రముగ్థుల్ని చేస్తోంది.
మోడల్ నుంచి సినీ హీరోయిన్గా మారిన శోభితా 2016లో `రమణ్ రాఘవ 2.0`తో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ హిందీ సినిమా విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా శోభిత గ్లామర్కి, నటనకు మంచి మార్కులే పడ్డాయి.
వరుసగా హిందీలో `చెఫ్`, `కాలకాండి`లో మెరిసింది. రెండేళ్ళ తర్వాత `గూఢచారి` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాలోనూ ఆమె తనదైన అందచందాలతో రెచ్చిపోయింది. ఆకట్టుకునే నటనతోపాటు అందాలతో కనువిందు చేసి సోషల్ మీడియాలో మంచి అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది.
అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న `మూథన్`తోపాటు `ది బాడీ`, `ఘోస్ట్ స్టోరీస్`లో మెప్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం మలయాళంలో `కురుప్`, తెలుగులో `మేజర్`, తమిళంలో `పొన్నియిన్ సెల్వన్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తుంది.
ఓ వైపు హీరోయిన్గా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటిస్తూనే, తన క్రియేటివిటీని చాటుకోబోతుంది. అందుకోసం క్రియేటివ్ స్టూడియోని ప్రారంభించబోతుంది. తాజాగా ఆ విషయాన్ని శోభితా పంచుకుంది.
ఆమె చెబుతూ, `నాకు రాయడమన్నా, చదవడమన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే సినిమాల్లోకి వచ్చేలా చేసింది. పరిశ్రమ ద్వారా పొందిన ఏడెనిమిదేళ్ళ అనుభవంతో మన దగ్గర ప్రతిభకు లోటు లేదని తెలిసింది. భిన్నమైన ఆలోచనలతో ఉన్న ప్రతిభ కలిగిన వాళ్లను చాలా మందిని చూశాను` అని తెలిపింది.
ఇంకా శోభితా చెబుతూ, `క్రియేటివ్ స్టూడియో అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. నేనో ప్లాట్ఫామ్ స్థాపించాలనుకుంటున్నానను. కొత్త ఆలోచనలు, కథలు, ఐడియాలను ఇక్కడ తయారు చేయించాలనుకుంటున్నా. ఈ ఆలోచన నాకు ఎప్పట్నుంచో ఉంది. ఇప్పటికది కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంద`ని పేర్కొంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో, ఎంత మందికి అవకాశాలిస్తారో చూడాలి.