దిశాపటానీ-టైగర్ ష్రాఫ్ః లాక్డౌన్ని బ్రేక్ చేస్తూ షికారు కెళ్లారు.. చివరికి అలా బుక్కైపోయారా?
ముంబయిలో కరోనా విలయం నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతుంది. కానీ దిశాపటానీ, టైగర్ ష్రాఫ్ జంటకి మాత్రం లాక్డౌన్ నియమాలు పట్టలేదు. తమ ప్రేమకి, షికార్లకి అడ్డే లేదంటున్నారు. ఇద్దరు కలిసి కారులో షికారుకెళ్లారు. దీంతో అడ్డంగా దొరికిపోయారు.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబయి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల వీరిద్దరు ముంబయిలోని బాంద్రా వీధుల్లో కార్లో షికారు కొడుతు పోలీసుల కంటపడ్డారు. విధుల్లో భాగంగా తనిఖీ నిర్వహిస్తుండగా దిశా పటానీ కార్ ముందు కూర్చుని కనిపించింది. వెనకాల టైగర్ ఉన్నారు.
జిమ్ నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ అలా డ్రైవ్ను ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. టైగర్ ష్రాఫ్ వెనుక సీట్లో కూర్చుని ఉండగా దిశా ముందు కూర్చున్నారు. ముంబై పోలీసులు బ్యాండ్ స్టాండ్లో రెండవ రౌండ్ తనిఖీలు నిర్వహిస్తూ వీరిని ఆపారట. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. సరైన కారణం లేకుండా బయటకు రావడం, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్న పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం.
దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. `మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి` అని మండిపడింది.
టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి` అని ఆయేషా చెప్పుకొచ్చింది.
దిశా పటానీ, టైగల్ ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే తమ ప్రేమని వీరిద్దరు అంగీకరించనప్పటికీ తరచూ మీడియాకి చిక్కుతూ షాకిస్తున్న విషయం తెలిసిందే. కాగా దిశా పటాని ప్రస్తుతం `ఏక్ విలన్ రిటర్న్స్`లో నటిస్తుండగా, టైగర్ ష్రాఫ్ `హీరోపంథి 2`లో నటిస్తున్నారు.