మా వల్లే ఇండస్ట్రీ నడుస్తుందనుకుంటారు.. చిరు, బాలయ్య ఇష్యూపై తేజ
కరోనా సినీ ఇండస్ట్రీకి నష్టాలను మాత్రమే కాదు ఎన్నో వివాదాలను కూడా తెర మీదకు తీసుకువచ్చింది. లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలను మరోసారి తెరమీదకు వచ్చాయి. చిరంజీవి నాయకత్వం, బాలకృష్ణ కామెంట్స్ ఇలా ఒక్క సంఘటన వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ వివాదంపై సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కూడా స్పందించాడు.
లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీకి సంబందించి అన్ని కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు అన్ని రంగాలకు సలడలింపులు ఇస్తుండటంతో సినీ పెద్దలు కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేపథ్యంలో సినీ ప్రముఖులంతా కలిసి తదుపరి కార్యచరణపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తరుపున సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
అంతేకాదు తరువాత చిరు నేతృత్వంలోనే సినీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తమ సమస్యలను నివేదించారు. అదే సమయంలో షూటింగ్లకు తిరిగి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ చర్చల్లో కేవలం వర్గం మాత్రం పాల్గొన్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ బహిరంగంగానే విమర్శించాడు. తనను చర్చలకు ఎవరూ ఆహ్వానించలేదని, వాళ్లు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, భూములు పంచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
అయితే బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబుతో పాటు ఇతరులు స్పందించటం, బాలయ్య మద్దతుగా కూడా కొంతమంది మాట్లాడంతో వివాదం మరింతగా పెరిగింది. అయితే తాజాగా ఈ వివాదంపై మరో దర్శకుడు కూడా స్పందించాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ తేజ ఈ వివాదంపై స్పందించాడు. నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కాదు కాబట్టి నన్ను పిలువలేదన్న తేజ, పర్సనల్ మీటింగ్ అయితే ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయం అందరినీ సంప్రదించి తీసుకుంటేనే కరెక్ట్ అని కామెంట్ చేశాడు.
ఇండస్ట్రీనే శాశ్వతం అన్న తేజ స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు వస్తుంటారు పోతుంటారు. ఇండస్ట్రీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను ఇండస్ట్రీని నడిపిస్తున్నానని అనుకోవటం అవివేకం అన్నాడు. అయితే ఏదేమైన వీలైనంత త్వరగా సినిమా కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూడాలని అన్నాడు తేజ.